ఖమ్మం, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సాధారణ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటనతో కౌంట్డౌన్ షురూ కావడంతో ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థులు జోరు పెంచారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే క్షేత్రస్థాయి ప్రచారంలో దూసుకెళ్తున్నది. 50రోజుల ముందే అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్ ఈ నెల 15వ తేదీన బీఫారంలను అందజేయనున్నారు. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ తొమ్మిదిన్నరేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ తమను మరోసారి గెలిపించాలని కోరుతున్నారు. ఈక్రమంలో ఇతర పార్టీల నుంచి పెద్దసంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతున్నారు. అభ్యర్థుల విజయానికి ఆయా నియోజకవర్గాల వారీగా ఎన్నికల ఇన్చార్జిలను పార్టీ ఇప్పటికే నియమించింది. గత నెలలో మంత్రి కేటీఆర్ పర్యటన పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. దీంతో ఇతర పార్టీలు అందుకోలేనంత స్పీడ్గా ప్రచారంలో కారు దూసుకెళ్తున్నది.
ఉమ్మడి ఖమ్మంజిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారరంగంలో దూసుకెళ్తున్నారు. అన్ని ప్రధాన రాజకీయ పార్టీల కన్నా ముందే ఎన్నికల ప్రచారపర్వాన్ని ప్రారంభించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఆయుధాలుగా ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్ వంటి ప్రధాన రాజకీయపార్టీ సైతం తమ అభ్యర్థులను తేల్చుకునేలోపే బీఆర్ఎస్ అభ్యర్థులు నిత్యం ప్రజల్లో ఉంటూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రజలకు మరింత చేరువకావడానికి మరోసారి తమను గెలిపించాలని కోరుతున్నారు. మరోవైపు ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని 10 నియోజకవర్గాల్లో వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి పెద్దసంఖ్యలో వలసలు పెరిగాయి. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించడానికి 50 రోజుల ముందే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. దీంతో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, పినపాక అభ్యర్థి రేగా కాంతారావు, పార్టీ అభ్యర్థులు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్రెడ్డి, బానోత్ మదన్లాల్, లింగాల కమల్రాజు, హరిప్రియానాయక్, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, తెల్లం వెంకట్రావు ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వైరా అభ్యర్థి బానోత్ మదన్లాల్కు మద్దతుగా ప్రస్తుత ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ నియోజకవర్గంలో విస్తృతంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తానని బహిరంగగా ప్రకటించిన రాములునాయక్పై ఇటీవల వైరాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ సభావేదికపై ప్రశంసల వర్షం కురిపించారు. అభ్యర్థుల విజయానికి రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించడానికి మంత్రి పువ్వాడ, ఎంపీలు, ఎమ్మెల్సీలను ప్రతి నియోజకవర్గానికి ఒకరిని ఇన్చార్జిలుగా పార్టీ నియమించింది.
ఖమ్మం, మధిర నియోజకవర్గాలకు మంత్రి పువ్వాడను ఇన్చార్జిగా నియమించగా ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాలకు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, వైరా, అశ్వారావుపేట నియోజకవర్గాలకు ఖమ్మం ఎంపీ, పార్టీ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి నియోజకవర్గానికి రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి, భద్రాచలం నియోజకవర్గానికి ఖమ్మం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ను నియమించింది. పినపాక నియోజకవర్గానికి పార్టీ అభ్యర్థి, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనులకు ఆకర్షితులై తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులు, ముఖ్యనేతలు పెద్దఎత్తున పార్టీలో చేరారు. పది నియోజకవర్గాల్లో అభ్యర్థుల విజయానికి ఎన్నికల ఇన్చార్జులు పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ నేతృత్వంలో వివిధ పార్టీల నుంచి పెద్దఎత్తున బీఆర్ఎస్లో చేరారు. ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు మరింత వేగం పుంజుకున్నాయి. గత నెలలో మంత్రి కేటీఆర్, ఖమ్మం, సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో పర్యటించి ప్రతిచోట వరాలజల్లు కురిపించడంతోపాటు కాంగ్రెస్, బీజేపీ వ్యవహారశైలిని తూర్పారపట్టడం, పార్టీ విజయం కోసం పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది.
15న అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10మంది బీఆర్ఎస్ అభ్యర్థులతో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లో సమావేశంకానున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, ప్రచార సరళి విజయానికి అనుసరించాల్సిన వ్యూహ, ప్రతివ్యూహాలపై చర్చించి దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులకు అదేరోజు పార్టీ బీఫారంలను అందజేయనున్నారు.