పెనుబల్లి, జనవరి 9: అన్నదాతలందరికీ సీఎం కేసీఆరే శ్రీరామరక్ష అయ్యారు. ఆయన ప్రోత్సాహంతో తెలంగాణలో వ్యవసాయం పండుగలా మారింది. ఎనిమిదేళ్ల క్రితం వరకూ బీళ్లుగా పడావు పడిన పొలాలన్నీ ఇప్పుడు పచ్చని పంటలతో దర్శనమిస్తున్నాయి. వాటి పక్కనే గలగల సవ్విడి చేస్తూ పంట కాలువలన్నీ సెలయేళ్లుగా పారుతున్నాయి. దీంతో అన్నదాతలందరూ అమితానందంతో సాగు పనుల్లో నిమగ్నమమయ్యారు. వానకాలం పంట చేతికొచ్చిన మద్దతు ధరకు విక్రయించుకున్న రైతులకు వెంటనే రెండో విడత రైతుబంధునూ ప్రభుత్వం అందించడంతో కర్షకులందరూ యాసంగి పనులకు నడుంబిగించారు. సీఎం కేసీఆర్ అందిస్తున్న ప్రోత్సాహంతోనే రైతులు, రైతుకూలీలు ఉత్సాహంగా పొలం పనులు చేసుకుంటున్నారు. పెనుబల్లి మండలం బ్రహ్మళ్లకుంటలో రైతులు, రైతు కూలీలు నాటు వేస్తున్న క్రమంలో ఆనందంతో వారు మాగాళ్ల మధ్యలో ఆంగ్లంలో ‘కేసీఆర్’ పేరు రూపంలో నారు కట్టలను పేర్చి కృతజ్ఞత తెలుపుకున్నారు.
పచ్చని పొలాలే తెలంగాణ చిహ్నం
ఎటుచూసినా కంటి నిండా ఆకుపచ్చనిహారంగా వరిపొలాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పచ్చని పొలాలన్నీ తెలంగాణ సస్యశ్యామలానికి చిహ్నంగా మారాయి. కేసీఆర్ లాంటి నాయకుడుంటే ఏ ప్రాంతమైనా ఇలానే పచ్చని రంగు పులుముకుంటుంది. ఏర్పడిన ఎనిమిదేళ్లలోనే రాష్ర్టాన్ని వ్యవసాయంలో అగ్రభాగంలో నిలిపిన ఘనత ఆయకే దక్కుతుంది. ఆయన ఉన్నంతకాలం సంబురంగా సాగు పనులు చేసుకుంటాం.
– రజియా, మహిళా రైతు, పెనుబల్లి