ఖమ్మం/ రఘునాథపాలెం, మార్చి 24 : అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చింది. ప్రకృతి వైపరీత్యానికి రైతు గుండె బరువెక్కింది. వీటిని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తానే కదిలి వచ్చారు. నేలవాలిన పంటలను పరిశీలించారు. ఏమీ అధైర్య పడవద్దని, అండగా తానున్నానని ధైర్యం చెప్పారు. నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటానని, ఎకరానికి రూ.10 వేల పరిహారం అందిస్తానని మాట ఇచ్చారు. భుజం తట్టి భరోసా కల్పించారు. క్షేత్రస్థాయిలో పంటలను చూపించి గోడు చెప్పుకున్న కర్షకుల కన్నీళ్లు తుడిచారు. దీంతో ఆత్మైస్థెర్యాన్ని కూడగట్టుకొని పైకి లేచిన అన్నదాతలు ఆయనకు రెండు చేతులూ జోడించి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఈ మేరకు శుక్రవారం రైతులు తమ పొలాల్లో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు.
ఖమ్మం అల్లీపురానికి చెందిన మొక్కజొన్న రైతులు తమ చేలల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్కుమార్ను ఆహ్వానించి తమ సంతోషాన్ని పంచుకున్నారు. దీంతో మంత్రి అజయ్కుమార్ కూడా రైతులతో కలిసి సీఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులందరినీ సీఎం ఆదుకుంటారని, ఎకరాకు రూ.10 వేల పరిహారం సాధారణ రైతులకు, కౌలు రైతులకు అందుతుందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ అంటే రైతుల పక్షపాతి అని, అన్నదాతల గుండెల్లో ఆయన స్థానం ఎప్పటికీ సుస్థిరమని, పరిహారం ప్రకటించి కర్షకుల కన్నీళ్లు తుడిచిన దేవుడు ఆయన అని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ కార్యాలయంలో..
అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు రూ.10 వేల పరిహారాన్ని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులతో కలిసి ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు మాట్లాడుతూ.. రైతుల గుండెల్లో సీఎం కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజుతోపాటు బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు నల్లమల వెంకటేశ్వరరావు, చింతనిప్పు కృష్ణచైతన్య, కొట్టె వెంకట్రావు, మద్దెల విజయ్, శ్రీను, మల్లయ్య, డోకుపర్తి సుబ్బారావు, రావూరి కరుణ, కూరాకుల వలరాజు, రావూరి సైదుబాబు, సంక్రాంతి నాగేశ్వరరావు, పత్తిపాటి వీరయ్య, సామినేని లింగయ్య, ముప్పారపు బాలకృష్ణ, దమ్మాలపాటి సైదులు, రావూరి నాగరాజు, బల్లెట్ బాబు, సామినేని రాంబాబు తదితరులు పాల్గొన్నారు.