ఖమ్మం, మే 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణలో బీఆర్ఎస్ 13 సీట్లను గెలవబోతుందని ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఆ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో గులాబీ జెండా ఎగరేయబోతున్నామని స్పష్టం చేశారు. ఖమ్మంలో పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావును, మహబూబాబాద్లో పార్టీ అభ్యర్థి మాలోత్ కవితను గెలిపించేందుకు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని అన్నారు. బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా కార్యాలయమైన నగరంలోని తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుతో కలిసి ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో కేసీఆర్ అవసరాన్ని, బీఆర్ఎస్ ఆవశ్యకతను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామంటూ ఆయా సభల్లో ప్రజలు అంటుండడమే ఇందుకు కారణమని అన్నారు. అలాగే, తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ బస్సుయాత్రకు, రోడ్ షోలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. అన్ని చోట్లా ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, నీరాజనం పలుకుతున్నారని వివరించారు. కేసీఆర్ పాలనను కోల్పోయామన్న భావన ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎన్నడూ కష్టాలపాలు కాని తాము.. కాంగ్రెస్ 150 రోజుల పాలనలోనే అనేక కష్టాలను చూస్తున్నామని ప్రజలు అంటున్నారని వివరించారు. రైతుబంధు ఇవ్వలేదని, పింఛన్లు పెంచలేదని, కల్యాణలక్ష్మి మంజూరు చేయలేదని, దాంతోపాటు ఇస్తామన్న తులం బంగారం మాటే మర్చిపోయారని చెబుతూ ప్రజలే ఆ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అన్నారు. చివరికి కరెంట్ రాకుండా, నీళ్లు లేకుండా చేసిందని అంటున్నారని అన్నారు. ‘ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ ఇవ్వదు. ఏమీ చేయదు..’ అనే నిర్ణయానికి ప్రజలు వచ్చారని అన్నారు. ప్రచారానికి ఇక రెండు రోజుల సమయం మాత్రమే ఉన్నందున శ్రేణులు ప్రజల వద్దకు వెళ్లి మరింత అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. పోలింగ్ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు మాట్లాడుతూ.. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి జిల్లా అభివృద్ధి కోసం ఏం చేశారో, జిల్లా అభివృద్ధిలో ఆయన పాత్ర ఏమైనా ఉందేమో చెప్పాలని డిమాండ్ చేశారు. సొంతూరైన చేగొమ్మకు గానీ, పాలేరు నియోజకవర్గానికి గానీ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పాత్ర ఖమ్మం జిల్లా అభివృద్ధిలో ఎంతో ఉందని స్పష్టం చేశారు. ఎంపీగా ఆయన అనేక అభివృద్ధి పనులు చేపట్టారని వివరించారు. మరో ఎంపీ వద్దిరాజు కూడా జిల్లాలో గ్రానైట్ పరిశ్రమల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. బయట వ్యక్తులకు ఓటేస్తే ఉపయోగమేమీ లేదని స్పష్టం చేశారు. పార్లమెంటులో తెలంగాణ వాణిని వినిపించే ‘నామా’ను గెలిపించాలని కోరారు.