యావత్ తెలంగాణ ప్రజలకు ‘కంటి వెలుగులు’ ప్రసాదించే అరదైన పండుగ మళ్లీ వచ్చింది.. ఇంటింటా వెలుగులు నింపుతున్నది. శుక్రవారం రెండో రోజు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శిబిరాలు కొనసాగాయి. ఉదయం 9 గంటలకే వైద్యబృందాలు వారికి కేటాయించిన శిబిరాలకు చేరుకున్నాయి. వైద్య బృందం ఆధార్కార్డులు తీసుకుని రిజిస్ట్రేషన్లు చేశారు. వెంటనే కంటి పరీక్షలు చేశారు. కళ్లద్దాలు అవసరమైన వారికి పంపిణీ చేశారు. కంటి సమస్య తీవ్రంగా ఉన్న వారికి ప్రత్యేకంగా కళ్లద్దాలు సిద్ధం చేయించి పది రోజుల్లో అందించనున్నారు. బృందాలకు హెచ్ఈలు, మండల వైద్యాధికారులు, పంచాయతీ సెక్రటరీలు సహకరిస్తున్నారు.
ఖమ్మం జనవరి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/భద్రాద్రి కొత్తగూడెం, (నమస్తే తెలంగాణ): ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం రెండో రోజు కంటి వెలుగు శిబిరాలు కొనసాగాయి. ఉదయం 9 గంటలకే వైద్యబృందాలు వారికి కేటాయించిన శిబిరాలకు చేరుకున్నాయి. అప్పటికే ప్రజలు భారీగా శిబిరాలకు చేరుకున్నారు. అధికారులు ప్రజల కోసం శిబిరాల్లో తాగునీటి వసతి కల్పించారు. వృద్ధులు కూర్చోవడానికి కుర్చీలు సమకూర్చారు. శిబిరానికి వచ్చిన వారి ఆధార్ నంబర్లు సేకరించి వైద్య బృందం అక్కడికక్కడే రిజిస్ట్రేషన్స్ చేశారు. వెంటనే కంటి పరీక్షలు చేశారు. కళ్లద్దాలు అవసరమైన వారికి వెంటనే పంపిణీ చేశారు. కంటి సమస్య తీవ్రంగా ఉన్న వారికి ప్రత్యేకంగా కళ్లద్దాలు సిద్ధం చేయించి పదిరోజుల్లో అందించనున్నారు. ఒక్కో శిబిరం ఒక్కో చోట పది రోజుల పాటు కొనసాగనున్నది. దూర ప్రదేశాల్లో శిబిరాలు నిర్వహించే వైద్యనిపుణులు, వైద్యసిబ్బందికి ప్రభుత్వ ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసింది. శిబిరాలకు ప్రజల నుంచి అనూహ్యస్పందన లభిస్తున్నది. వైద్య బృందాలకు హెచ్ఈలు, మండల వైద్యాధికారులు, పంచాయతీ సెక్రటరీలు సహకరిస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో..
తిరుమలయపాలెం మండలం కేశ్వాపురంలో ఎంపీపీ బెల్లం శ్రీను ప్రారంభించారు. వైరాలోని రైతువేదికలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని మాజీ శాసనసభ సభ్యురాలు బానోత్ చంద్రావతి సందర్శించారు. కొణిజర్ల మండలం వందనంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ స్నేహలత మొగిలి సందర్శించారు. ఖమ్మం రూరల్ మండలం ఎంవీ పాలెం కేంద్రాన్ని జిల్లా వైదార్యోగశాఖ అధికారిణి బి.మాలతి సందర్శించారు.
భద్రాద్రి జిల్లాలో..
భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 48 బృందాలు గ్రామాలు, పట్టణాల్లో కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నాయి. రెండో రోజు పట్టణాల్లో 12 కేంద్రాలు, గ్రామాల్లో 36 చోట్ల క్యాంపులు కొనసాగించాయి. మొత్తం 6639 మందికి కంటి పరీక్షలకు నిర్వహించారు. 2,380 మందికి కళ్లద్దాలు అవసరమని గుర్తించారు. కంటి సమస్య తీవ్రంగా ఉన్న వారిని 1059 మందిని గుర్తించారు. వారికి ప్రత్యేకంగా కళ్లజోళ్లు సిద్ధం చేయించి త్వరలో అందజేయనున్నారు. భద్రాద్రి కలెక్టర్ అనుదీప్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ శిరీష పర్యవేక్షించారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 12,842 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. 4,784 మందికి కళ్లజోళ్లు అందించారు.
వ్యయప్రయాసలు తప్పాయి..
మా ఇంటి సమీపంలో కంటి వెలుగు శిబిరం నిర్వహిస్తున్నారని తెలిసి ఇక్కడికి వచ్చా. ఆధార్ కార్డు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నా. వైద్యసిబ్బంది వెంటనే నాకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కళ్ల మసకులు వస్తున్నాయని గుర్తించి కళ్లజోడు అందజేశారు. వెంటనే కళ్లజోడు ఇస్తారని నేను ఊహించలేదు. ఇలా వచ్చి అలా ఇంటికి వెళ్లేలా ప్రభుత్వం శిబిరాలను నిర్వహిస్తున్నది.
– కోట శోభ, సఫాయిబస్తీ, కొత్తగూడెం
ఇంటింటికీ వచ్చి పరీక్షలు చేసినట్లే ఉంది..
ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నది. వైద్యసిబ్బంది ఇంటింటికీ వచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లే ఉన్నది. శిబిరం వద్ద వృద్ధులు కూర్చోవడానికి కుర్చీలు ఉన్నాయి. నేను శిబిరానికి వచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నాను. కళ్ల మసకలు వచ్చినట్లు గుర్తించి కళ్లజోడు ఇచ్చారు. శిబిరం లేకపోతే నేను వైద్యం చేయించుకునే
దానిని కాదు.
– నాగమణి, ఇందిరానగర్, లక్ష్మీదేవిపల్లి మండలం
కేసీఆర్ ఏది చేసినా ప్రజల మంచికే..
ప్రజలు కంటి సమస్యలతో బాధపడకూడదని సీఎం కేసీఆర్ కంటి వెలుగు శిబిరాలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ ఏది చేసినా ప్రజల మంచి కోసమే. కంటి సమస్యలతో బాధపడే పేదలు ఇప్పటికీ ఎంతోమంది ఉన్నారు. వారికి ఈ శిబిరాలు ఉపయోగపడతాయి. నేను ఎన్నో రోజుల నుంచి కంటి సమస్యతో బాధపడుతున్నాను. శిబిరంలో వైద్యసిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించి వెంటనే కళ్లద్దాలు ఇచ్చారు. మాలాంటి పేదోళ్లకు శిబిరాలు వరం.
– ప్రసాద్ సాహు, మేదరబస్తీ, కొత్తగూడెం