బోథ్, జనవరి 29 : కంది రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మార్కెట్లో మద్దతు ధరకు మించి పలుకుతుండడంతో లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో కంటే దిగుబడి తగ్గినా ధర అనుకూలంగా ఉండడంతో పంట పండినట్లేనని అన్నదాతల్లో హర్షాతిరేకాలు వినిపిస్తున్నాయి. బోథ్ మండలంలో వానకాలం పంట కింద 5460 ఎకరాల్లో కంది పంటను రైతులు సాగు చేశారు. పత్తి, సోయా పంటల్లో అంతర పంటగా వేశారు. ప్రస్తుతం రైతులు కోతలు మొదలు పెట్టారు. ట్రాక్టర్, హార్వెస్టర్ల నూర్పిడి యంత్రాల ద్వారా నూర్పిడి చేయిస్తున్నారు. మరికొంత మంది కోసిన కందులను గుల్లుగా వేసి ఆరబెడుతున్నారు.
ప్రభుత్వం క్వింటాల్ కందులకు రూ.6,600 మద్దతు ధర ప్రకటించగా ప్రస్తుతం అంతకు మించి మార్కెట్లో ధర పలుకుతున్నది. డిమాండ్కు అనుగుణంగా పంట మార్కెట్కు రాకపోవడంతో వ్యాపారులు నాణ్యతను బట్టి రూ. 6,600 నుంచి రూ.7,200 వరకు ధర చెల్లిస్తూ కొనుగోలు చేస్తున్నారు. అంతర పంటగా పత్తిలో సాగు చేసిన రైతులకు ఎకరానికి 3 నుంచి 5 క్వింటాళ్ల వరకు దిగుబడి రాగా సోయాలో వేసిన రైతులకు 6 నుంచి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. పంట సాగు కోసం ఎకరానికి రూ.3 వేల నుంచి రూ. 5 వేల వరకు అన్నింటికి కలిపి పెట్టుబడి రూపేనా ఖర్చయినట్లు రైతులు తెలిపారు. ఖర్చులు పోనూ ఎకరానికి రూ.12 వేల నుంచి రూ. 20 వేల వరకు ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. కంది సాగు చేసిన రైతులకు మాత్రం ఎకరానికి రూ.20 వేలకు పైగా ఆదాయం సమకూరినట్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వానకాలంలో పత్తిలో అంతర పంటగా కంది సాగు చేశా. నాలుగు ఎకరాల్లో పంట వేశా. ఎకరానికి 3 నుంచి 4 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. అధిక వర్షాల మూలంగా దిగుబడి తగ్గినా మార్కెట్లో ధర అనుకూలంగా ఉండడంతో పెట్టుబడులుపోనూ కొంత సొమ్ము మిగిలింది. -అయినవేణి
పోతలింగు, రైతు, అందూర్
సోయాలో అంతర పంటగా కందిని సాగు చేశా. తొమ్మిది ఎకరాల్లో పంటను వేశా. ఎకరానికి ఎనిమిది క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చింది. క్వింటాల్కు రూ.7 వేల చొప్పున ధర పలుకగా అమ్మేశా. ఈ యేడు కంది పంట మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అటు సోయాతో పాటు ఇటు కందులు బాగానే పండాయి.
-మేర్గు లింగారెడ్డి, రైతు, బోథ్