కారేపల్లి, మే 3: పోరాడి సాధించుకున్న తెలంగాణలో మూడోసారీ కేసీఆరే ముఖ్యమంత్రి అని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. ప్రజలు అడగకుండానే అనేక ఫలాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు జీవో 58, 59ల ఇళ్ల క్రమబద్ధీకరణ పట్టాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో కూడా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు లేవని విమర్శించారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణను అణగదొక్కేందుకు ప్రధాని మోదీ కుట్ర పన్నారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు విక్రయిస్తున్న ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కిందని దుయ్యబట్టారు. ఇదే సందర్భంగా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తోందని గుర్తుచేశారు. గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణలో ప్రతి కుటుంబానికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాయని వివరించారు. తొలుత ఇటీవల చీమలపాడు ప్రమాదంలో గాయపడిన గేటు కారేపల్లికి చెందిన తేళ్ల శ్రీనివాసరావు, కారేపల్లికి చెందిన పప్పుల నిర్మలలను వారి ఇళ్లకు వెళ్లి పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు. డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పెద్దబోయిన ఉమాశంకర్, తోటకూరి పిచ్చయ్య, ముత్యాల సత్యనారాయణ, నర్సింగ్ శ్రీనివాసరావు, అజ్మీరా వీరన్న, రావూరి శ్రీనివాసరావు, దుగ్గినేని శ్రీనివాసరావు, అడ్డగోడ ఐలయ్య, ధరావత్ మంగీలాల్, ఇస్లావత్ సుజాత, భూక్యా రంగారావు, బానోత్ పద్మావతి, ఈసాల నాగేశ్వరరావు, కుర్సం సత్యనారాయణ, షేక్ షఫీ, మునీర్పటేల్, బత్తుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.