వీఆర్ఏలు సంబురాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న 622 మంది గ్రామ రెవెన్యూ సహాయకులు వారివారి విద్యార్హతల ఆధారంగా పోస్టింగ్లు, వేతనాలు అందుకోనున్నారు. వారికి మూడు క్యాటగిరీల్లో పే స్కేలు వర్తింపజేస్తూ క్రమబద్ధీకరించడంతో ‘జయహో కేసీఆర్’ అంటూ కొనియాడుతున్నారు. జిల్లావ్యాప్తంగా వీఆర్ఏలు సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
– మామిళ్లగూడెం, జూలై 25
మామిళ్లగూడెం, జూలై 25 : రెవెన్యూశాఖను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ చట్టంలో అనేక మార్పులు తెచ్చింది. వ్యవస్థలో పేరుకుపోయిన లోపాలను సరిచేసేందుకు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సహసోపేత నిర్ణయాలు తీసుకొని రెవెన్యూశాఖను గాడిలో పెట్టారు. ప్రధానంగా గ్రామస్థాయిలో రెవెన్యూశాఖలో పనిచేస్తున్న వీఆర్వో, వీఆర్ఏలపై అనేక ఆరోపణలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆ రెండు వ్యవస్థలను రద్దు చేశారు. అనంతరం వీఆర్వోలను వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నస్థానాలలో వారి ఉద్యోగస్థాయి ప్రకారంగా విలీనం చేసి పోస్టింగ్లు కల్పించారు. నాటినుంచి వీఆర్ఏలను ఏశాఖలో విలీనం చేయకుండా వారికి వేతనాలు చెల్లిస్తున్నప్పటికీ గత కొద్దికాలంగా వారి సంఘం ప్రభుత్వంతో చర్చలు జరిపింది. వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పేస్కేల్ ఇవ్వాలని, వారసులకు ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం దృష్టికి తీసుకపోయారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణస్థాయిలో వీఆర్ఏలుగా విధులు నిర్వహిస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు అవసరం ఉన్న ఇతరశాఖల్లో వారిని విలీనం, పేస్కేల్, వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో రెవెన్యూ అధికారుల లెక్కల ప్రకారం 758 వీఆర్ఏ పోస్టులు ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం 622మంది పని చేస్తుండగా మరో 136 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల విషయంలో ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటికే కలెక్టర్ వీపీ గౌతమ్ జిల్లాలో వీఆర్ఏల వివరాలు సేకరించి వారిని ప్రభుత్వ నిబంధనల మేరకు వివిధశాఖల్లో విలీనం చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో కొందరు వారస్తత్వంగా పని చేస్తుండగా మరికొందరు నేరుగా నియామకాల ద్వారా ఎంపికై విధులు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 10వ తరగతి ఉత్తీర్ణత లేదా ఫెయిల్ అయినా దానికంటే దిగువ విద్యార్హతలు ఉన్నవారిని వివిధశాఖల్లో నాల్గో తరగతి ఉద్యోగులుగా నియామకం చేయనున్నారు. వారికి వేతనంగా రూ.19,000- 58,850గా నిర్ణయించారు. ఇంటర్మీడియట్ విద్యార్హత ఉన్నవారికి రికార్డ్ అసిస్టెంట్ లేదా దానికి సమానమైన ఉద్యోగం కల్పిస్తారు. వీరికి వేతనం రూ.22,240- 67,300గా పేర్కొన్నారు. అలాగే డిగ్రీ నుంచి ఆపైన విద్యార్హతలు ఉన్నవారికి జూనియర్ అసిస్టెంట్ లేదా దానికి సమానమైన ఉద్యోగం కల్పిస్తారు. వీరికి వేతనంగా రూ.24,280- 72,850గా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే 1-10-2011లో కొందరు వీఆర్ఏలు అనార్యోగం, వయోభారం కారణంగా తమ వారసులకు ఉద్యోగాలు కల్పించాలని దరఖాస్తులు చేసుకున్నారు. వారి వినతిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం వారి వారసులకు అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో 758 వీఆర్ఏ పోస్టులు ఉండగా వాటిలో 622మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 189 మంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నేరుగా రిక్రూట్మెంట్ ద్వారా నియామకాలు పొందారు. మిగతా 433మంది వారసత్వంగా ఉద్యోగాలను కొనసాగిస్తున్నారు. వీరిలో పోస్టు గ్రాడ్యుయేట్స్-80, డిగ్రీ-162, ఇంటర్-207, పదో తరగతి-47, పదో తరగతిలోపు- 126 మంది వరకు ఉన్నారు. వీరందరికి వారి విద్యార్హతల ఆధారంగా పోస్టులను వివిధశాఖల్లో కేటాయించనున్నారు.
2012లో వీఆర్ఏ పోస్టులకు నేరుగా రిక్రూట్మెంట్ ద్వారా నియామకం పొందాను. విద్యార్హతను గుర్తించి ఉద్యోగోన్నతులు లభిస్తాయి. ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు. ఇతర శాఖల్లో వీలినం చేసే సమయంలో పేస్కేల్తోపాటు ఇతర అలవెన్సులు వర్తించనున్నాయి. ప్రభుత్వం నిర్ణయానికి ఆనందంగా ఉంది.
– ఉప్పు రమాదేవి, వీఆర్ఏ సంఘం ఖమ్మం జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు
వీఆర్ఏలుగా ఎక్కువ మంది బడుగు, బలహీనవర్గాల వారు ఉన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో వీఆర్ఏలకు మేలు జరుగుతుంది. ఎంతోకాలంగా ఉద్యోగ భద్రతపై అనుమానాలు ఉన్న మాకు ముఖ్యమంత్రి నిర్ణయం భరోసా కల్పించింది. ప్రభుత్వానికి మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది.
– పోన్నెబోయిన నాగరాజు, వీఆర్ఏ, ముదిగొండ, అసోసియేషన్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి
ముఖ్యమంత్రి కేసీఆర్కు వీఆర్ఏల తరఫున ధన్యవాదాలు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మాకు వరాలు కురిపించారు. వీఆర్ఏల అర్హతల ప్రకారంగా పోస్టులు కేటాయించడం ఆనందంగా ఉంది. వీఆర్ఏల సమస్యల పట్ల సానుకూలంగా నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్కు వీఆర్ఏలందరూ రుణపడి ఉంటారు.
– చల్లా లింగరాజు, వీఆర్ఏ, గూడురుపాడు, అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు
సీఎం కేసీఆర్ తీసుకున్న ఒక్క నిర్ణయం మా జీవితాలను మార్చివేసింది. చెప్పలేని సంతోషంగా ఉన్నాం. మా కష్టాన్ని, శ్రమను గుర్తించినందుకు ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. గతంలో తమ కష్టాలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాం. మంత్రి సావధానంగా విని సీఎంకు వివరించారు. జీతాలు పెంచి.. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి హామీ నిలబెట్టుకున్నారు.
– నవమణి, సుజాతనగర్ వీఆర్ఏ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తెలంగాణ రాష్ట్రంలో మా శ్రమను సీఎం కేసీఆర్ గుర్తించారు. ఆయన నిర్ణయంతో మా జీవితాల్లో వెలుగులు నిండాయి. దేవుడితో సమానంగా కేసీఆర్ను పూజిస్తాం. మాకు ఏ శాఖలో విధులు కేటాయించినా క్రమశిక్షణతో నిర్వర్తిస్తాం. ప్రభుత్వం మమ్మల్ని పర్మినెంట్ చేసి, పే స్కేల్ అమలు చేసి అక్కున చేర్చుకుంది.
– ఎండీ జావీద్, వీఆర్ఏ జాక్ కన్వీనర్, కొత్తగూడెం
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తోనే వీఆర్ఏలకు పూర్తిస్థాయి న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఏర్పడింది. పేస్కేల్, వారసత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నందుకు కేసీఆర్కు రుణపడి ఉంటాం. ఈ నిర్ణయంతో వీఆర్ఏల జీవితాల్లో వెలుగులు నిండాయి.
– బోగి సునీత, వీఆర్ఏ, లక్ష్మీపురం, సంఘం అసోసియేషన్ జిల్లా మహిళా విభాగం కార్యదర్శి