భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ భద్రాచలం, మార్చి 30: ‘సిరి కల్యాణపు బొట్టును పెట్టి.. మణిబాసికమును నుదుటన గట్టి..’ అనే కల్యాణ శ్లోకాలు భద్రగిరిలో మార్మోగాయి. భద్రాచలం దివ్యక్షేత్రంలోని మిథిలా ప్రాంగణంలోని శిల్పకళా శోభితమైన కల్యాణ మండపంలో గురువారం జగదభిరాముడు, సీతాదేవిల కల్యాణం వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే అర్చకులు మూలవరులకు, నిత్య కల్యాణమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తులకు భక్త రామదాసు తయారు చేయించిన దివ్యాభరణాలను అలంకరించి ప్రత్యేక పల్లకీలో మిథిలా ప్రాంగణంలోని కల్యాణ మండపానికి తీసుకొచ్చి ప్రత్యేక వేదికపై ఉంచారు.
కల్యాణానికి వినియోగించే ద్రవ్యాలు, పరిసరాలకు పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేపట్టారు. రామయ్య కుడిచేతికి, సీతమ్మ తల్లి ఎడమ చేతికి రక్షా బంధనం చేశారు. ఇరువురి వంశ ప్రవరను, గోత్రాలను విన్నవించారు. రామయ్యకు యజ్ఞోపవీతధారణ, సీతమ్మకు యోక్త్రధారణ చేసి వరపూజ చేశారు. భక్తరామదాసు చేయించిన పచ్చల పతకాన్ని రామయ్యకు, చింతాకు పతకాన్ని సీతమ్మకు, శ్రీరామ మాడను లక్ష్మణుడికి అలంకరించారు. అధర్వణ వేద పండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు సీతారాముల కల్యాణాన్ని భక్తులకు వివరించారు.
అభిజిత్ లగ్నంలో..
సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అర్చకులు అభిజిత్ లగ్నంలో సీతారాముల శిరస్సుపై జీలకర్ర, బెల్లాన్ని ఉంచారు. గౌరీదేవి, సరస్వతి, శ్రీమహాలక్ష్మిని ఆవాహన చేశారు. 12:10 గంటలకు సీతమ్మకు మాంగళ్యధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. లోకంలో ఎవరికైనా పుట్టింటి వారు, మెట్టింటి వారు తయారు చేయించిన రెండు మంగళ సూత్రాలు మాత్రమే ఉంటాయని, కానీ ఇక్కడ జనక మహరాజు, దశరథ మహరాజుతోపాటు భక్త రామదాసు తయారు చేయించిన మరో సూత్రం కూడా ఉండడం విశేషమని వేద పండితులు భక్తులకు వివరించారు.
పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రి అల్లోల..
రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానంతోపాటు పలు దేవాలయాల నుంచి వచ్చిన పట్టు వస్ర్తాలను ఆయా అర్చకులు జానకిరాములకు సమర్పించారు. సీతమ్మ వారికి సిరిసిల్లా నేత కార్మికులు ప్రత్యేకంగా తయారు చేసిన పట్టు చీరెను అందజేశారు. ఎంపీ వద్దిరాజు, ఆయన కుమారుడు నిఖిల్బాబు స్వామివారి పల్లకిని మోశారు. అనంతరం వేద పండితులు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దంపతులకు తలంబ్రాలు అందజేశారు.
పుట్టిన రోజు నాడే రామయ్యకు కల్యాణం..
పుట్టిన రోజు నాడే శ్రీరామచంద్ర మహా ప్రభువుల వారికి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ అని, భద్రాచలంలో రామయ్య కల్యాణానికి నిర్ణయించిన ముహూర్తాన్నే ప్రపంచ వ్యాప్తంగా శ్రీరామనవమి జరుగుతుందని జీయర్ స్వామి అనుగ్రహభాషణం చేశారు.
ప్రముఖుల హాజరు..
జానకిరాముల కల్యాణంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ తాతా మధు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోతు కవిత, వైరా, పాలేరు, భద్రాలచం, ఇల్లెందు ఎమ్మెల్యేలు రాములునాయక్, కందాళ ఉపేందర్రెడ్డి, పొదెం వీరయ్య, హరిప్రియ, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఏపీ స్వీకర్ తమ్మినేని సీతారాం, ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్, భద్రాద్రి కలెక్టర్ అనుదీప్, ఎస్పీ డాక్టర్ వినీత్, ఏఎస్పీ పరితోశ్ పంకజ్, అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, దేవస్థానం ఈవో రమాదేవి, హైకోర్టు న్యాయమూర్తులు భీమపాక నగేశ్, అభిషేక్రెడ్డి, నవీన్రావు, కర్నూలు జిల్లా జడ్జి శ్రీనివాసరావు, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు, ఏపీ మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, మాజీ ఎంపీ పోరిక బలరాంనాయక్, ఆర్డీవో రత్నకల్యాణి, తహసీల్దార్ శ్రీనివాస్యాదవ్ పాల్గొన్నారు.
పోటెత్తిన భక్తజనం..
సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు దేశ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయమే పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం మిథిలా స్టేడియానికి చేరుకొని కల్యాణాన్ని కనులారా వీక్షించారు. ప్రభుత్వం చేసిన అన్ని ఏర్పాట్లనూ భక్తులు వినియోగించుకున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు కూడా అనేక సేవలందించాయి. అన్నదానం, పానకం, మజ్జిగ, మంచినీరు వంటివి పంపిణీ చేశాయి. నిరుటి కంటే ఈ ఏడాది భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
నేడు పుష్కర పట్టాభిషేకం
భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దివ్యక్షేత్రంలో శుక్రవారం సంప్రదాయబద్ధంగా పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకాన్ని నిర్వహించనున్నారు. శ్రీరామనవమి రోజున సీతారాముల కల్యాణం నిర్వహించిన మరునాడు అదే వేదికపై స్వామివారికి పట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది స్వామివారికి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఏ దేవుడికీ లేని పట్టాభిషేక వైభవం ఒక్క శ్రీరామచంద్రుడికి మాత్రమే నిర్వహిస్తారు. భద్రాచలంలో 60 ఏళ్లకు ఓసారి మహా సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహించడం భక్త రామదాసు కాలం నుంచి వస్తున్న ఆచారం. అందులో భాగంగా 1987లో ప్రభవ నామ సంవత్సరంలో పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు.
ఈ అపూరూప ఘట్టాన్ని జీవితంలో ఒక్కసారి మాత్రమే చూడగలం. ఈ అవకాశం అందరికీ దక్కాలనే ఉద్దేశంతో 12 ఏళ్లకు ఓసారి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకాన్ని నిర్వహించాలని దేవస్థానం వైదిక కమిటీ నిర్ణయించింది. 2011లో తొలిసారిగా ఈ వేడుకను జరిపింది. తదుపరి పుష్కరాన్ని ఈ ఏడాది నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆలయ ప్రాంగణంలో రెండు యాగశాలలు నిర్మించి ద్వాదశ కుండాత్మక హోమాలు, శ్రీరామ మహా క్రతువులు జరుపుతున్నారు. కాగా, శుక్రవారం మిథిలా ప్రాంగణంలోని కల్యాణ మండపంలో అయోధ్యరాముడికి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరుపుతారు. ఈ మహోజ్వల ఘట్టాన్ని తిలకించేందుకు గవర్నర్ తమిళసై హాజరు కానున్నారు.
పర్ణశాలలో వైభవంగా..
పర్ణశాల, మార్చి 30: దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల దేవాలయంలో సీతారాముల కల్యాణం గురువారం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అర్చకులు మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో సీతారాములవారి కల్యాణాన్ని వేదమంత్రాలు, మేళతాళాలతో శాస్ర్తోక్తంగా జరిపించారు. ఆలయ అధికారులు ఏఈవో భవాని రామకృష్ణ దంపతులు స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. అర్చకులు శేషకిరణ్కుమార్ ఆచార్యుల బృంద సభ్యులు రాములోరి కల్యాణ ప్రాశస్త్యాన్ని వివరించారు.
నేడు పర్ణశాలకు గవర్నర్ తమిళిసై..
పర్ణశాల రాముణ్ని దర్శించుకునేందుకు, పుష్కర పట్టాభిషేకంలో పాల్గొనేందుకు గవర్నర్ తమిళిసై శుక్రవారం పర్ణశాలకు రానున్నారు. ఆమె పర్యటన సందర్భంగా అధికారులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
జానకిరాముల కల్యాణం సైడ్ లైట్స్