భద్రాచలం, ఫిబ్రవరి 24 : సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వివిధ సమస్యలపై గిరిజనులు సమర్పించిన వినతుల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో పీవో అర్జీలు స్వీకరించారు. తన పరిధిలోని వాటిని పరిష్కరించి, మిగిలిన వాటిని సంబంధిత శాఖల అధికారులకు పంపించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ పోడు భూములు, వ్యక్తిగత సమస్యలు, స్వయం ఉపాధి పథకాలకు రుణాలు, పట్టా భూములకు రైతుబంధు, జీవనోపాధి పెంపొందించేందుకు ఆర్థిక సాయం, ట్రైకార్ సబ్సిడీ రుణాలు తదితర అంశాలపై అర్జీలు వచ్చినట్లు తెలిపారు.
వీటిని ఆన్లైన్ చేసి విడతలవారీగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏపీవో జనరల్ డేవిడ్రాజ్, డీడీ మణెమ్మ, ఎస్డీసీ రవీంద్రనాథ్, గురుకులం ఆర్సీవో నాగార్జునరావు, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ చంద్రశేఖర్, ఏవో సున్నం రాంబాబు, అగ్రికల్చర్ ఎస్వో భాస్కరన్, ఏపీవో పవర్ వేణు, ఆర్వోఎఫ్ఆర్ డీటీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.