అశ్వారావుపేట, ఏప్రిల్ 14 : దివ్యాంగుల సంక్షేమానికి ఇప్పటికే అనేక పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర సర్కార్ తాజాగా నూరు శాతం సబ్సిడీపై ఉపకరణాలు అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే అర్హుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ఈ నెల 24లోపు దివ్యాంగులు ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నది. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 30 వేల మందికి పైగా దివ్యాంగులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా సంక్షేమశాఖ అధికారులు దివ్యాంగుల అవసరాలకు అనుగుణంగా యంత్రాలు, యంత్ర పరికరాలు, వాహనాలు, వినికిడి యంత్రాలు, ట్రై సైకిళ్లు, వీల్చైర్లు, ల్యాప్టాప్లు సిద్ధం చేస్తున్నారు.
దివ్యాంగులకు రాయితీలు ఇలా..
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నెల నెలా దివ్యాంగుకలు రూ.3,016 చొప్పున ఆసరా పింఛన్ ఇస్తున్నది. డీఆర్డీఏ ద్వారా సబ్సిడీ రుణాలు ఇచ్చి స్వయం ఉపాధికి ప్రోత్సాహమిస్తున్నది. ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి బస్పాస్లు, దివ్యాంగుల వివాహాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నది. అలాగే వందశాతం రాయితీపై ఉపకరణాలనూ అందివ్వనున్నది. దివ్యాంగులు hhhps//tsobmms.cgg. gov.in పోర్టల్లో ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నది.
మోటర్ వెహికల్కు వీరు అర్హులు..
75 శాతం కన్నా ఎక్కువ వైకల్యం ఉండి 18- 50 ఏళ్ల లోపు వయస్సున్న దివ్యాంగులు వందశాతం రాయితీపై మోటర్ వెహికిల్ అందుకునేందుకు అర్హులు. అదే విధంగా వారు డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ పూర్తి చేసి మూడేళ్ల కాలపరిమితి దాటి ఉండాలి.
డైసీ ప్లేయర్కు..
75 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న అంధత్వ వికలాంగులు డైసీ ప్లేయర్ తీసుకునేందుకు అర్హులు. వారు ఇంటర్మీడియట్ పూర్తి చేసి 15 ఏళ్లు నిండిన వారై ఉండాలి.
ల్యాప్టాప్లకు&
75 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉండి 18-50 ఏళ్లలోపు ఉన్న వారు ల్యాప్టాప్ తీసుకునేందుకు అర్హులు. వారు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 40శాతం వైకల్యం ఉండి పీహెచ్డీ పూర్తి చేసిన దివ్యాంగులూ దీనికి అర్హులే.
బ్యాటరీ వీల్ చైర్కు..
40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉండి కండరాలు, కీళ్ల బలహీనత, వెన్నుపూస విరిగిన దివ్యాంగులు అర్హులు. వారి వయస్సు 12 ఏళ్లు దాటి ఉండాలి.
స్మార్ట్ ఫోన్లకు..
51 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న బధిర దివ్యాంగులు 4జీ స్మార్ట్ ఫోన్లు తీసుకునేందుకు అర్హులు. వీరి వయస్సు 16- 50 లోపు ఉండాలి. ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి..
తెలంగాణ దివ్వాంగుల సహకార సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో దివ్యాంగులకు ఉపకరణాలు అందించనున్నది. శారీకర వైకల్యంతో పాటు బధిరులు, మానసిక దివ్యాంగులూ ఉపకరణాలు పొందేందుకు అర్హులే. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారులకు ఉపకరణాలు పంపిణీ చేస్తాం. దివ్యాంగులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హులందరికీ ఉపకరణాలు అందుతాయి.
– స్వర్ణలతా లెనీనా, జిల్లా సంక్షేమశాఖ అధికారి, కొత్తగూడెం