మామిళ్లగూడెం, డిసెంబర్ 21 : వివిధ సమస్యలపై బాధితులు సమర్పించిన వినతులపై విచారణ చేసి.. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా చట్టపరిధిలో పరిష్కరించాలని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోలీస్ కమీషనర్ కార్యాలయంలో గురువారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 20 మంది బాధితుల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీస్ కమిషనర్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికంగా భూ వివాదాలు, కుటుంబ, వ్యక్తిగత సమస్యలతోపాటు ఆర్థిక లావాదేవీలు, భార్యాభర్తల సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను ఆయన పరిశీలించారు. ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ చేసి.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.