ఖమ్మం, జూన్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): “వచ్చే సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పదికి పది ఎమ్మెల్యే స్థానాలను బీఆర్ఎస్సే కైవసం చేసుకుంటుంది. రెండు పార్లమెంట్ స్థానాలనూ గెలుచుకుంటాం. గులాబీ పార్టీని వ్యతిరేకించే రాజకీయ పార్టీలు జిల్లాకు చేసింది ఏమీలేదు”. అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం ‘నమస్తే తెలంగాణ’ మంత్రితో ఇంటర్వ్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం నగరంలో నేను చేపట్టిన అభివృద్ధి ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. నేను ప్రజాసేవకుడిగా ప్రజలతో మమేకం కావడానికే ఇష్టపడతానన్నారు. ప్రజలతో నాకు ఆత్మీయ అనుబంధం ఉందని, వారి బంధం నుంచి నన్ను ఎవరూ దూరం చేయలేరని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ చేసిన అభివృద్ధే వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తుందని, పార్టీ హ్యాట్రిక్ విజయం ఖాయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. సోమవారం ఆయన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ‘నమస్తే’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి, జిల్లాలో చోటుచేసుకుంటున్న పరిణామాలను వివరించారు.
పదికి పది స్థానాలు మావే..
ప్రజాసేవకుడిగా, ప్రజల మధ్యలో ఉండడమే నా అభిమతం. విద్యార్థి దశ నుంచే నాకు సమస్య ఎక్కడుంటే అక్కడ నిలబడడం ఇష్టం. ఆ సమస్యను పరిష్కరించే విధంగా పనిచేయడం ఇష్టం. ఇదే స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో ఉమ్మడి జిల్లాను అభివృద్ధి బాటలో నడిపించాం. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పదికి పది ఎమ్మెల్యే స్థానాలను బీఆర్ఎస్సే కైవసం చేసుకుంటుంది. రెండు పార్లమెంట్ స్థానాలనూ గెలుచుకుంటాం. గులాబీ పార్టీని వ్యతిరేకించే రాజకీయ పార్టీలు జిల్లాకు చేసింది ఏమీలేదు. వారి మాటలను జిల్లా ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరు. అభివృద్ధికి నిర్వచనం బీఆర్ఎస్. ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. అభివృద్ధిలో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉంది. ఉమ్మడి పాలనలో వెనుకబడిన జిల్లా నేడు అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంది.
శరవేగంగా సీతారామ ప్రాజెక్ట్ పనులు..
పాలేరు నియోజకవర్గంలోని భక్తరామదాసు ఎత్తిపోతల పథకం వరదాయిని అయింది. పథకం నియోజకవర్గ పరిధిలోని 60వేల ఎకరాలను సస్యశ్యామలం చేసింది. మరోవైపు ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు చకచకా సీతారామ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి. ప్రాజెక్టు పూర్తయితే సాగునీరు పుష్కలం. ప్రాజెక్ట్ పనులపై ప్రత్యేక దృష్టి సారించాం.
ప్రజల కోసం కొత్త నిర్మాణాలు..
భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఖమ్మం నగరంలోని ఎన్నెస్పీ క్యాంప్లో నూతన బస్టాండ్ నిర్మించాం. పాత బస్టాండ్ నుంచి పల్లె వెలుగు బస్సు సర్వీసులను ప్రారంభించాం. రెండు జిల్లాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా వెజ్, నాన్వెజ్ మార్కెట్లు, కూరగాయల మార్కెట్లు నిర్మించాం. ప్రధాన రహదారుల్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశాం. ప్రతి గ్రామాన్ని లింక్ రోడ్లతో అనుసంధానించాం. రెండు జిల్లాకేంద్రాల్లో కలెక్టరేట్ సముదాయాలను నిర్మించాం. దళితబంధు పథకం అమలుకు చింతకాని మండలం పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైంది. మండలవ్యాప్తంగా ఉన్న 3,461 కుటుంబాలు రూ.346 కోట్ల విలువైన యూనిట్లు అందుకుని స్వయం ఉపాధి పొందుతున్నాయి. వారి కుటుంబాల్లో వెలుగులు నిండాయి.
అన్నిరంగాల్లో నగరాభివృద్ధి..
ఖమ్మంలో నగరంలో నేను చేపట్టిన అభివృద్ధి ఎంతో సంతృప్తినిచ్చింది. నేను ప్రజాసేవకుడిగా ప్రజలతో మమేకం కావడానికే ఇష్టపడతాను. ప్రజలతో నాకు ఆత్మీయ అనుబంధం ఉంది. వారి బంధాన్ని నాకెవరూ దూరం చేయలేరు. నగరంలోని త్రీటౌన్ ప్రాంతం 10 కిలోమీటర్ల మేర ఉన్న గోళ్లపాడు కాలువ గతంలో కారణంగా అధ్వానంగా ఉండేది. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో రూ.70 కోట్లతో చానెల్ పనులు పూర్తి చేశాం. వర్షపు నీరు, మురుగు వేర్వేరుగా వెళ్లేలా కాలువలు నిర్మించాం. 812 నిర్వాసిత కుటుంబాలకు ఇండ్ల స్థలాలు కేటాయించాం. ఒకప్పుడు నగరవాసులకు వినోదం కోసం సినిమాలకు వెళ్లేవారు. ప్రస్తుతం లకారం ట్యాంక్బండ్ అందుబాటులోకి రావడంతో నగరవాసులు ఆహ్లాదం కోసం ఇక్కడికే వస్తున్నారు. కేబుల్ బ్రిడ్జిపై నడిచి ఆనందాన్ని పొందుతున్నారు. రోప్ సైక్లింగ్, వాకింగ్ ట్రాక్, మ్యూజికల్ ఫౌంటెన్ను ఎంజాయ్ చేస్తున్నారు. పార్కుల్లో కాలక్షేపం చేస్తున్నారు. నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా రూ.22కోట్లతో మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం నిర్మించాం.
మెడికల్ కాలేజీలో త్వరలో తరగతులు..
ఖమ్మం మెడికల్ కళాశాలలో త్వరలో 100 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ అవుతాయి. నిర్మాణ పనులకు ప్రభుత్వం నుంచి రూ.166 కోట్లు మంజూరయ్యాయి. పాత కలెక్టరేట్, ఆర్అండ్బీ భవన సముదాయంతో పాటు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలోని మొత్తం 30.23 ఎకరాలను మెడికల్ కళాశాలకు బదలాయించాం. జిల్లా ఆసుపత్రిని మెడికల్ కళాశాలకు అనుసంధానం చేశాం. త్వరలో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమవుతాయి. కొత్తగూడెం మెడికల్ కళాశాలలో ఇప్పటికే తరగతులు ప్రారంభమయ్యాయి.