ఖమ్మం ఎడ్యుకేషన్/కొత్తగూడెం ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 28: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఫస్టియర్ విద్యార్థులు తెలుగు/ సంస్కృతం/హిందీ పరీక్ష రాశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరిగింది. నిమిషం నిబంధన అమలులో ఉండడంతో పరీక్షా సమయానికి ముందుగానే విద్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ముద్దాడుతూ ‘ఆల్ ది బెస్ట్’ చెప్పి కేంద్రాల్లోకి పంపించారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ బోర్డు 70 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటి పరిధిలో 19,499 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 900 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 16,919 మందికి 16,286 మంది, ఒకేషనల్ కోర్సులు చదువుతున్న వారిలో 2,580 మందికి 2,313 మంది విద్యార్థులు హాజరయ్యారు. తొలిరోజు ‘ఏ’ సెట్ ప్రశ్నాపత్రం ఎంపికైంది. తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలు జూనియర్ కళాశాల కేంద్రాన్ని కలెక్టర్ గౌతమ్ తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాలను హై పవర్ కమిటీ, డీఈసీ బృందాలు, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు, సిట్టింగ్ స్కాడ్ బృందాలు 35 కళాశాలలను తనిఖీ చేశాయి. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 36 కేంద్రాలు ఏర్పాటు కాగా 10,771 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉన్నది. తొలిరోజు పరీక్షకు 938 మంది గైర్హాజరయ్యారు. జనరల్లో 8,227 మందికి 7,828 మంది, ఒకేషనల్లో 2,544 మందికి 2,005 మంది హాజరయ్యారు. భద్రాద్రి జిల్లాలోని పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ప్రియాంక ఆల, ఎస్పీ రోహిత్రాజు, నోడల్ ఆఫీసర్ సులోచనారాణి తనిఖీ చేశారు. విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కు పాల్పడకుండా చూడాలని సిబ్బందికి సూచించారు.
వేసవి దృష్ట్యా యాజమాన్యాలు పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి కల్పించాయి. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్యారోగ్యశాఖ వైద్యసిబ్బందిని నియమించి, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాల్సి ఉండగా కొన్ని పరీక్షా కేంద్రాల్లోనే వైద్య సిబ్బంది అందుబాటు ఉన్నారు. ఖమ్మం జిల్లాకేంద్రంలో వైద్యసిబ్బంది జాడే లేదు. ప్రశ్నాపత్రాల తరలింపులో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులు భద్రత నియమాలను మరిచారు. జిల్లాస్థాయి అధికారుల పర్యవేక్షణ, పోలీసుల భద్రత నడుమ కారులోనే ప్రశ్నాపత్రాలను తరలించాల్సి ఉండగా ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఖమ్మంలోని వన్ టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ల నుంచి ప్రైవేటు వాహనాల ద్వారా ప్రశ్నాపత్రాలను తరలించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు దృష్టిసారించాల్సి ఉన్నది.
కొత్తగూడెంలోని సింగరేణి మహిళా కాలేజీ కేంద్రానికి పావని, సింగరేణి పాఠశాల కేంద్రానికి సాయికుమార్, నలంద పరీక్షా కేంద్రానికి రూప, సిద్ధ్దార్థ కేంద్రానికి హుస్సేన్ అనే విద్యార్థి పరీక్షా ప్రారంభ సమయం కంటే ఆలస్యంగా వచ్చారు. దీంతో అధికారులు కేంద్రాల్లోకి అనుమతించలేదు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మణికర్ణిక అనే దివ్యాంగురాలు రాసే పరీక్షకు దివ్య అనే విద్యార్థిని సహాయకురాలిగా వచ్చి పరీక్ష రాసింది.
ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు గురువారం నుంచి పరీక్షలు రాయనున్నారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 70 కేంద్రాల్లో 18,097 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 8 గంటల నుంచే విద్యార్థులకు పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉంటుంది.విద్యార్థులు bietelangana.cgg. gov. in అనే వెబ్సైట్ నుంచి హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.