చింతకాని, ఫిబ్రవరి 8 : సబ్సిడీ గ్యాస్, ఉచిత విద్యుత్ పథకాలకు సంబంధించి ఇంటింటి సర్వే చేస్తున్న అధికారులు, సిబ్బందికి యజమానులు సమగ్ర సమాచారం ఇవ్వాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. వందనం గ్రామంలో చేపట్టిన సబ్సిడీ గ్యాస్, ఉచిత విద్యుత్ పథకాలకు సంబంధించి ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని గురువారం కలెక్టర్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు ఇవ్వడంతోపాటు ప్రజల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హత కలిగి ఉండి..
తప్పులు దొర్లిన ప్రతి కుటుంబానికి సంబంధించిన ధ్రువపత్రాలు సిద్ధంగా ఉంచుకొని సర్వే సిబ్బందికి తెలియజేయాలన్నారు. సర్వే సిబ్బంది సైతం డేటా ఎంట్రీ ప్రక్రియను సమర్థంగా నిర్వహించాలని సూచించారు. అలాగే నాగులవంచ, పందిళ్లపల్లి, వందనం, నేరడ తదితర గ్రామాల్లో చేపట్టిన సర్వేను జడ్పీ సీఈవో వింజం వెంకట అప్పారావు, డీఆర్డీవో విద్యాచందన పరిశీలించి.. అధికారులకు సూచనలిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవో శ్రీనివాసరావు, కార్యదర్శులు చెవుల మహేశ్, వల్లంకొండ మరళి, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.