మధిర, మార్చి 25 : వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పదికి పది స్థానాలు గెలవడం ఖాయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. శనివారం మధిర పట్టణంలో రూ.12.28 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అంబారుపేట చెరువు కట్టపై రూ.5.70 కోట్లతో నిర్మించిన ట్యాంక్బండ్, వర్తకసంఘం వద్ద రూ.4.50 కోట్లతో నిర్మించిన సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ను ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, కలెక్టర్ వీపీ గౌతమ్, ఎమ్మెల్సీ తాతా మధు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజుతో కలిసి మంత్రి పువ్వాడ ప్రారంభించారు. వీటితోపాటు ఎల్ఆర్ఎస్ నిధులు రూ.2.8 కోట్లతో రోడ్డు వైన్డింగ్, సెంట్రల్ లైటింగ్, సీసీరోడ్లు, డ్రైన్స్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్కుమార్ మాట్లాడుతూ ఖమ్మం పట్టణానికి దీటుగా మధిర పట్టణాన్ని మునుపెన్నడూ లేనివిధంగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
పట్టణ ప్రజల సౌకర్యార్థం కూరగాయలు, పండ్లు, మాంసం, నిత్యవసర వస్తువులు ఒకేచోట అందుబాటులో ఉండే విధంగా నిర్మాణాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మూడేళ్లలో మధిరకు 30సార్లు వచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టానన్నారు. మధిర చెరువు వెలుగుజిలుగులతో విరాజిల్లుతుందన్నారు. నాడు మున్సిపాలిటీలు దుర్భరంగా ఉన్నాయని, నేడు సుందరమైన మున్సిపాలిటీగా సీఎం కేసీఆర్ పాలనలో తీర్చిదిద్దామన్నారు. ఏ పార్టీలోకి వెళ్తారో.. ఏ పార్టీలో ఉంటారో తెలియని నాయకులు కూడా సీఎంను గద్దె దించుతామని ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. పార్టీలో ఉండి ఆ పార్టీనే ఓడించే విధంగా కొంతమంది నాయకులు పని చేశారన్నారు. బీఆర్ఎస్లో కేసీఆర్కు శత్రులైతే బీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తకు, నాయకులకు వారు శత్రులవుతారని, మిత్రులు కాకూడదని వివరించారు. సీఎం కేసీఆర్ మధిర నియోజకవర్గంలో మొక్కజొన్న పంటల కోసం పరిశీలనకు వస్తే స్థానిక ఎమ్మెల్యే మాత్రం ఇక్కడ లేకుండా ఏదో ఉద్దరించడం కోసం వేరే జిల్లాల్లో పాదయాత్ర చేస్తున్నారన్నారు.
మధిర చరిత్రలో పెద్దఎత్తున అభివృద్ధి
మధిర చరిత్రలో పెద్దఎత్తున అభివృద్ధి జరిగిందని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఎనిమిదేళ్లలో రాష్ట్రంలోని జిల్లాలు, గ్రామాలు, మున్సిపాలిటీలు అభివృద్ధిపథంలో పయనిస్తున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా బీఆర్ఎస్ పాలనలో ప్రజల సంక్షేమం దేశంలోనే ఆదర్శంగా పరిపాలన చేస్తుందన్నారు.
కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష
తెలంగాణకు సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామరక్షగా ఉంటుందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు అన్నారు. మంత్రి కేటీఆర్ సహకారంతో మధిర అభివృద్ధి జరిగిందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మధిర గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. దీనికోసం నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ అభివృద్ధికి పాటుపడాలన్నారు. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ను గెలిపించుకొని అండగా నిలవాలన్నారు.
రైతుల శ్రేయస్సే కేసీఆర్ ధ్యేయం
సీఎం కేసీఆర్ రైతుల శ్రేయస్సే ధ్యేయంగా కృషి చేస్తున్నారని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు అన్నారు. 24గంటలపాటు విద్యుత్ సరఫరా అందించడంలో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు ఏ రాష్ట్రంలో లేవన్నారు.
తెలంగాణ ప్రభుత్వంలోనే మధిర అభివృద్ధి
తెలంగాణ ప్రభుత్వంలోనే మధిర పట్టణం, నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమైందని జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజు అన్నారు. సుమారు రూ.50 కోట్లకు పైగా మధిర పట్టణంలో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. వంద పడకల ఆసుపత్రితోపాటు, వెజ్, నాన్వెజ్ మార్కెట్, ట్యాంక్బండ్ నిర్మాణాలతోపాటు, మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ వంటి అభివృద్ధి జరిగిందన్నారు. అనంతరం డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మధిర మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత మాట్లాడారు.
మంత్రి సమక్షంలో పార్టీలో చేరికలు..
కాంగ్రెస్ పార్టీకి చెందిన మధిర 17వ వార్డు కౌన్సిలర్ మునుగోటి వెంకటేశ్వర్లు, దొడ్డ నాగేశ్వరరావు, నంబూరి శ్రీరామ్మూర్తి, వేములపల్లి విశ్వనాథం, చారగుండ్ల విశ్వనాథం, దాచేపల్లి రాము, సగ్గుల జనార్దన్రావు, కాజా చక్రవర్తి, సతీశ్, సామినేని లక్ష్మి మంత్రి పువ్వాడ, ఎంపీ నామా, జిల్లా అధ్యక్షుడు తాతా మధు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, జిల్లా రైతుబంధు సమితి కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ రంజిత్కుమార్, మధిర మున్సిపల్ కమిషనర్ రమాదేవి, పర్యాటక శాఖ జిల్లా అధికారి సుమన్చక్రవర్తి, కౌన్సిలర్ మల్లాది వాసు, బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు రావూరి శ్రీనివాసరావు, కునుమూరి వెంకటేశ్వరరావు, అరిగె శ్రీనివాసరావు, బొగ్గుల భాస్కర్రెడ్డి, మొండితోక జయాకర్, బొమ్మెర రామ్మూర్తి, శీలం విద్యాలత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, పెంట్యాల పుల్లయ్య, చేబ్రోలు మల్లికార్జునరావు, ఎంపీపీ మెండెం లలిత, నాయకులు శీలం వెంకటరెడ్డి, కరివేద సుధాకర్, సయ్యద్ ఇక్బాల్, అప్పారావు, ఎస్వీ రెడ్డి, వేమూరి ప్రసాద్, చావా రామకృష్ణ, తాళ్లూరి హరిశ్, గుర్రం రామారావు, చావా వేణు, కోనా నరేందర్రెడ్డి పాల్గొన్నారు.