ఖమ్మం సిటీ, ఫిబ్రవరి 8: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ఖమ్మం జిల్లాలో జోరుగా సాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 15,88,382 మందికి వైద్యపరీక్షలు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. జిల్లావ్యాప్తంగా గ్రామ పంచాయతీలు 589, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, మధిర, వైరా, సత్తుపల్లి మున్సిపాలిటీల్లోని 125 ఆవాసాల పరిధిలో 714 వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో 10 మంది వైద్యనిపుణులు, వైద్యసిబ్బంది, సహాయకులు ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 92,140 మందికి కంటి పరీక్షలు చేయగా.. 24,035 మందికి రీడింగ్ గ్లాసులు అందజేశారు. 12,106 మందికి ప్రిస్కిప్షన్ గ్లాసులకు ఆర్డర్ ఇచ్చారు.
‘ఊరూరా ‘కనుల’ పండుగ జరుగుతున్నది. ప్రజలు ఎదుర్కొంటున్న కంటి సంబంధిత వ్యాధులకు చరమగీతం పాడే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గత నెల 18న నుంచి ప్రతిష్ఠాత్మకంగా రెండు విడత కంటి వెలుగు శిబిరాలు కొనసాగిస్తున్నది. సీఎం కేసీఆర్ ఖమ్మంలోని నూతన కలెక్టరేట్లో కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్యాదవ్తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఖమ్మం నగరంతో పాటు గ్రామాలు, పట్టణాల్లో శిబిరాలు జోరుగా కొనసాగుతున్నాయి.
పక్కా వ్యూహంతో లక్ష్యం దిశగా..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రెండో విడత ‘కంటి వెలుగు’ ప్రారంభించింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 15,88,382 మందికి వైద్యపరీక్షలు నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. జిల్లావ్యాప్తంగా గ్రామ పంచాయతీలు 589, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, మధిర, వైరా, సత్తుపల్లి మున్సిపాలిటీల పరిధిలోని 125 ఆవాసాల పరిధిలో వైద్యసిబ్బంది 714 వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో 10 మంది వైద్యనిపుణులు, వైద్యసిబ్బంది, సహాయకులు ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా..
జిల్లావ్యాప్తంగా 55 మంది మెడికల్ ఆఫీసర్స్, 55 మంది కంటి వైద్య నిఫుణులు శిబిరాల వద్ద అందుబాటులో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు 300 మంది, పట్టణాల పరిధిలో 400 మందికి కంటి పరీక్షలు చేస్తున్నారు. కుల, మత, పేద, మధ్యతరగతి, ఉన్నత వర్గాలనే తేడా లేకుండా ప్రభుత్వం ప్రతిఒక్కరికీ కంటి వెలుగులు అందిస్తున్నది. శిబిరాలకు వెళ్లిన వారికి వైద్యసిబ్బంది అప్పటికప్పుడే అవసరమైన వారికి చుక్కల మందు, టాబ్లెట్స్ ఇస్తున్నారు. దృష్టి లోపం (ప్లస్-1, ప్లస్ 1.5, ప్లస్-2, ప్లస్ 2.5) ఉన్నవారికి అక్కడికక్కడే రీడింగ్ కళ్లద్దాలు అందజేస్తున్నారు. అవసరాలకు తగినట్లుగా ప్రిస్క్రిప్షన్ గ్లాసులు ఆర్డర్ పెడుతున్నారు. రెండు నుంచి మూడు వారాల వ్యవధిలోనే ఏఎన్ఎం, ఆశ కార్యకర్తల సాయంతో ఇంటి వద్దకే వెళ్లి కళ్లద్దాలు పంపిణీ చేయనున్నారు.
నిరంతరం మంత్రి అజయ్ పర్యవేక్షణ..
జిల్లాపరిధిలోని 32 ప్రాథమిక, అర్బన్ హెల్త్ సెంటర్స్ పరిధిలో మొత్తం 55 వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. వైద్యసిబ్బంది ఇప్పటివరకు 92,140 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 24,035 మందికి దగ్గరి చూపు సమస్య ఉందని గుర్తించి రీడింగ్ గ్లాసులు అందజేశారు. మరో 12,106 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసులు అవసరమని గుర్తించి ఆర్డర్ పెట్టారు. వారికి వారం రోజుల్లో కళ్లద్దాలు అందుతాయి. ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రజలకు శిబిరాలపై ఆవగాహన కల్పిస్తున్నారు. శిబిరాలపై ప్రతిరోజూ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, కలెక్టర్ వీపీ గౌతమ్ సమీక్షిస్తున్నారు. రోజువారీ లెక్కలు తెప్పించుకుంటూ ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వైద్యారోగ్యశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్శాఖల అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. అడిషనల్ కలెక్టర్తో సహా డీఎంహెచ్వో, ఇతర విభాగాల ప్రధాన అధికారులు శిబిరాలను పరిశీలిస్తున్నారు. కార్పొరేటర్లు, సర్పంచ్లు ప్రజాప్రతినిధులు వైద్యబృందాలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.