ఖమ్మం, మార్చి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీసీలను ఎదగనిచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. కేసీఆర్ బీసీలకు అండదండలు అందించారని, దీనిలో భాగంగానే వద్దిరాజు రవిచంద్రకు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారన్నారు. ఖమ్మం నగరంలోని బైపాస్రోడ్డు గాయత్రి మైదానంలో ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన కేసీఆర్ కృతజ్ఞత, వద్దిరాజు రవిచంద్ర అభినందన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సాధన కోసం బీఆర్ఎస్ కొట్లాడిందని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమ నేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ర్టాన్ని సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దారన్నారు. జలాలను తరలించి బంజరు భూములను మాగాణిగా మార్చారన్నారు. అభివృద్ధిని పరుగులు పెట్టించి సంస్కరణలకు నాంది పలికారన్నారు. బీసీల పక్షపాతిగా వారి కోసం సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. వద్దిరాజు రవిచంద్రకు ఇచ్చిన మాట ప్రకారం రెండోసారి రాజ్యసభ సభ్యుడి పదవిని కట్టబెట్టారన్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం బీసీలకు ఎంతో ప్రాధాన్యమిచ్చిందన్నారు. బీసీలకు నామినేటెడ్ పదవులనూ కట్టబెట్టిందని గుర్తుచేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల పదవులనూ గుంజుకున్నదని మండిపడ్డారు. బీసీలు రాజకీయంగా ఎదుగుతున్నారనే అక్కసుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ నేతలకు బుద్ధి చెప్పాలన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావును భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ.. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించడమే కాదు.. పార్టీ కష్టాల్లో ఉన్నప్పడు అండగా ఉండి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న ఎన్నికలో పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ సారయ్య మాట్లాడుతూ.. బీసీల ఆత్మబంధువు కేసీఆర్కు బీసీలు అండగా నిలివాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, హరిప్రియానాయక్, తాటి వెంకటేశ్వర్లు, వనమా వెంకటేశ్వరరావు, మదన్లాల్, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ సీతాలక్ష్మి, ముఖ్యనాయకులు జూలూరి గౌరీశంకర్, డాక్టర్ ప్రకాష్, కొండబాల కోటేశ్వరరావు, దూదిమెట్ల బాలరాజు, తాడూరి శ్రీనివాసరావు, ఆంజనేయులు, దిండిగాల రాజేందర్, వెంకటేశం, తిరుమలరావు, మానవతారాయ్, రాజారాం యాదవ్ పాల్గొన్నారు.
గులాబీ జెండానే బీసీలకు అండ. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలకు ఎంతో ప్రాధాన్యమిచ్చారు. అత్యంత వెనుకబడిన 13 కులాలను బీసీల జాబితాలో చేర్చారు. బీసీ పిల్లల కోసం గురుకులాలు ఏర్పాటు చేశారు. బీసీలు ఆర్థికంగా ఎదిగేందుకు రుణాలు ఇచ్చారు. బీసీ యువతలో నైపుణ్యాలు పెంచి ఉపాధి కల్పించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బీసీలను పదవుల నుంచి తొలగిస్తున్నది. వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నది. రానున్న ఎంపీ ఎన్నికల్లో బీసీలంతా ఒక్కటై బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.