తెలంగాణ ప్రభుత్వం పేద విద్యార్థులకు పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించింది. మన ఊరు-మన బడి పథకం కింద కార్పొరేట్ స్థాయిలో అన్ని హంగులతో తీర్చిదిద్దింది. పిల్లలను చదివించే భారం తల్లిదండ్రులపై పడకుండా సీఎం కేసీఆర్ ప్రభుత్వం భుజస్కంధాలపై వేసుకుంది. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో నిష్ణాతులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన బోధన అందిస్తున్నది. పాఠ్య, నోట్ పుస్తకాలు, రెండు జతల దుస్తులు, మధ్యాహ్నం సన్నబియ్యంతో భోజనం వడ్డిస్తున్నది. ఇక ఉదయం అల్పాహారం అందించి సీఎం బ్రేక్ఫాస్ట్ పథకంతో పేద విద్యార్థుల ఆకలి తీర్చుతున్నారు. డ్రాపౌట్స్ను తగ్గించి.. విద్యార్థులకు చదువుపై ఆసక్తి కలిగే విధంగా పథకం దోహదపడుతున్నది. ‘మా ఇళ్లల్లో ఇంత పొద్దున్నే పిల్లలకు పెట్టలేని అల్పాహారాన్ని సీఎం కేసీఆర్.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించడం ఆనందకరం. ఇంతటి ప్రతిష్ఠాత్మక పథకానికి రూపకల్పన చేసి అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు’ అని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.
విద్యార్థుల ఆకలి తీర్చే అద్భుత పథకం ‘సీఎం బ్రేక్ఫాస్ట్’ అని పేద విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ తీరును కొనియాడుతున్నారు. తమ పిల్లలకు అంత పొద్దున్నే టిఫిన్లు పెట్టే స్థాయి లేని బాధ్యతను సీఎం కేసీఆర్ తీసుకోవడం మంచి పరిణామమని, సంతోషకరమని మెచ్చుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ‘మధ్యాహ్నం సన్నబియ్యంతో వంట చేసి భోజనం వడ్డించడం.. విద్యాసంవత్సరం ప్రారంభానికే పాఠ్య పుస్తకాలు, రెండు జతల దుస్తులు అందించిన ప్రభుత్వం ఇప్పుడు ‘సీఎం బ్రేక్ఫాస్ట్’ పథకాన్ని ప్రారంభించడం ఎప్పటికీ మరిచిపోలేం. మా బాధ్యతను ఎత్తుకున్న సీఎం కేసీఆర్ను జీవితాంతం గుర్తుంచుకుంటాం’ అని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు.
మా లాంటి పేద కుటుంబాల్లో పోషకాలతో కూడిన ఆహారం అందదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతోపాటు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, దుస్తులను తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది. మధ్యాహ్న భోజనంతోపాటు ఇప్పుడు ప్రవేశపెట్టిన సీఎం అల్పాహార పథకం మా లాంటి నిరుపేద విద్యార్థులకు గొప్ప వరం. ఇంటి దగ్గర దొరకని పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్న సీఎం కేసీఆర్ సార్కు సర్వదా కృతజ్ఞతలు.
ప్రభుత్వ పాఠశాలల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన అల్పాహార పథకం చాలా బాగుంది. మా ఇద్దరు పిల్లలు పాత సెంటర్లోని ప్రాథమిక పాఠశాలలో 2, 3వ తరగతి చదువుతున్నారు. గతంలో ఇంటి వద్దే టిఫిన్ చేసి పాఠశాలకు వెళ్లేవారు. అక్కడే మధ్యాహ్న భోజనం తినేవారు. కానీ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అల్పాహార పథకంలో భాగంగా ఇక నుంచి ఉదయమే పాఠశాలకు వెళ్లి అక్కడే టిఫిన్, భోజనం చేయడం అభినందనీయం. ఇలాంటి పథకం ప్రవేశపెట్టిన ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
ఉదయమే అమ్మానాన్న వేర్వేరు పనులకు వెళ్లేందుకు సిద్ధమయ్యేవారు. నేను ఉదయమే పాఠశాలకు వెళ్లేందుకు రెడీ అయి హడావుడిగా బయలుదేరేవాడిని. ఇంట్లో అప్పటికే అమ్మకు టిఫిన్ తయారు చేసేందుకు టైం ఉండేది కాదు. దీంతో ఖాళీ కడుపుతోనే పాఠశాలకు వచ్చేవాడిని. తెలంగాణ ప్రభుత్వం అల్పాహార పథకాన్ని ఏర్పాటు చేయడం మా లాంటి పేద పిల్లలకు ఎంతో అవసరం. పోషకాలు ఉండే ఆహారం ఉదయమే అందిస్తున్న సీఎం కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు.
మా పాప చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నది. ఇప్పటికే ఉదయం రాగి జావ అందిస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి అల్పాహార పథకం పేరుతో విద్యార్థులకు రోజూ టిఫిన్ అందించడం సంతోషంగా ఉంది. మా పిల్లలు ఇంటి కంటే ఎక్కువగా బడిలో ఉండడానికే ఇష్టపడుతున్నారు. ఉదయం టిఫిన్ దగ్గర్నుంచి మధ్యాహ్నం నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. రాత్రి ఒక్కపూట మాత్రమే ఇంట్లో భోజనం చేస్తున్నారు. పౌష్టికాహారం అందించడమే కాకుండా ఆంగ్లలో బోధన చేస్తూ విద్యను కార్పొరేట్ స్థాయిలో అందిస్తున్నారు.
సీఎం కేసీఆర్ ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పని చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు మన ఊరు-మన బడి ద్వారా తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలను అభివృద్ధి చేసింది. అలాగే విద్యార్థులు ఆరోగ్యకరంగా ఉండేందుకు ఉదయం పూట సీఎం కేసీఆర్ బ్రేక్ఫాస్ట్తో పథకాన్ని చేపట్టడం హర్షణీయం. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అనంతరం రాగిజావ పథకాలు చేపట్టిన గొప్ప మానవతావాది సీఎం కేసీఆర్.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉదయం టిఫిన్ అందించాలనే ప్రభుత్వ ఆలోచన ఎంతో గొప్పది. సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం చాలా బాగున్నది. నిన్న ఉదయం పాఠశాలలో పలు రకాల వెరైటీలతో కూడిన టిఫిన్ తిని పిల్లలు ఇంటికొచ్చిన ఆనందంతో చెబుతుంటే చాలా సంతోషం అనిపించింది. మా లాంటి పేదల పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడుల్లో అన్ని సౌకర్యాలను కల్పించి ఉచితంగా నాణ్యమైన బోధన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎంతో రుణపడి ఉంటాం.