ఖమ్మం, జూలై 2: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ధైర్యముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు డిమాండ్ చేశారు. ఆయన సభకు జనం రాకపోతే తప్పు మాదెలా అవుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్పై ప్రజలకు ప్రేమ ఉంటే ఎవరాపినా ఆగకుండా వస్తారు కదా? అని అన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అహంకారంతో బీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పది రోజుల నుంచి పొంగులేటి, ఆయన అనుచరులు రెచ్చిపోతున్నా బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడా స్పందించలేదని అన్నారు. సీఎల్పీ నేత భట్టి ఎంతోకాలంగా తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నాడని, ఆయనకు ప్రభుత్వంగానీ, అధికారులుగానీ ఎక్కడా ఆటంకం కలించలేదని అన్నారు. అలాగే ఖమ్మం సభకూ ఎలాంటి ఆటంకమూ కలిగించలేదని అన్నారు.
ప్రజలు సభకు రాకుండా అధికారులు కేసులు పెడుతున్నారని, నీళ్లు బంద్ చేస్తున్నారని పొంగులేటి ఆరోపించడం తగదని అన్నారు. తెలంగాణలో పలు పార్టీలకు చెందిన జాతీయ నేతలు ఎన్నో సభలకు హాజరయ్యారని అన్నారు. వారి సభలను ఎక్కడైనా అడ్డుకున్నామా? అని ప్రశ్నించారు. ఖమ్మంలో ఇటీవల సీఎం కేసీఆర్ నిర్వహించిన సభకంటే పెద్దగా సభ నిర్వహిస్తామని, లక్షల్లో ప్రజలు హాజరవుతారని గొప్పలు చెప్పుకున్న పొంగులేటి.. చివరకు సభకు ప్రజలు పెద్దగా రావడంలేదని తెలిసి ఆ నిందను బీఆర్ఎస్పై మోపుతున్నారని ఆరోపించారు. చెక్పోస్టులు పెట్టామనడం అబద్ధమని అన్నారు. జిల్లా రాజకీయ చర్రితలో ఏ నాయకుడూ మాట్లాడని భాష పొంగులేటి మాట్లాడుతున్నారని అన్నారు. ఇది ప్రజాస్వామిక రాజకీయాలకు, అందులోనూ ఖమ్మం జిల్లాకు సరైంది కాదని అన్నారు. ఇప్పటికైనా పొంగులేటి తన బుద్ధిని, భాషను మార్చుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు బచ్చు విజయ్కుమార్, ఉప్పల వెంకటరమణ, నల్లమల వెంకటేశ్వరరావు, పగడాల నాగరాజు, చింతనిప్పు కృష్ణచైతన్య, పగడాల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.