ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 27 : రైతుల పంట ఉత్పత్తుల నాణ్యత విషయంలో నష్టం కలిగించే చర్యలకు పాల్పడే వ్యాపారుల లైసెన్స్లు రద్దు చేస్తామని కలెక్టర్ వీపీ గౌతమ్ హెచ్చరించారు. మంగళవారం నగరంలోని వ్యవసాయ మార్కెట్లో మిర్చి యార్డును సందర్శించిన కలెక్టర్ క్రయవిక్రయాలను తనిఖీ చేశారు. మిర్చి రైతులతో మాట్లాడుతూ పంట ఎంతమేరకు దిగుబడి వచ్చింది.. మార్కెట్లో ఎంత ధర లభిస్తున్నది అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిర్చి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
నాణ్యమైన మిర్చి పంటకు ధర తగ్గిస్తే అలాంటి వ్యాపారులపై చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెట్కు రైతులు తీసుకొచ్చిన ప్రతి బస్తా కొనుగోలు అయ్యే విధంగా చూడాలని, కొనుగోళ్ల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ అన్నారు. కాగా.. మిర్చి జెండాపాట క్వింటా ధర రూ.21,400 పలికింది. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఎం.విజయనిర్మల, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎంఏ.అలీం, పీడీఎంఐపీ రమణ, మార్కెట్ కమిటీ సెక్రటరీ ప్రవీణ్కుమార్, ఏఈవో సాయిశిరణ్మయితోపాటు పలువురు మార్కెట్ అధికారులు పాల్గొన్నారు.