సత్తుపల్లి టౌన్, అక్టోబర్ 20: తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కేసీఆరేనని, సంక్షేమ ఫలాలు ఇచ్చేదీ కేసీఆరేనని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఇటీవల విడుదల చేసిన మ్యానిఫెస్టో ప్రకారం తదుపరి ఎన్నికల్లో గెలిచిన వెంటనే అర్హులందరికీ రూ.400కే వంట గ్యాస్ సిలిండర్లు అందుతాయని అన్నారు. సత్తుపల్లి పట్టణంలో శుక్రవారం పర్యటించిన ఆయన.. 1 నుంచి 5, 12 నుంచి 17 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, తనకు అత్యధిక మెజార్టీ అందించాలని కోరారు. రైతులను ఆదుకోవాలనే సంకల్పంతో దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రతి రైతుకూ ఎకరానికి రూ.10 వేల చొప్పున రైతుబంధును ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి..
కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో గెలిచిన వెంటనే రైతుబీమా మాదిరిగా కేసీఆర్ బీమా పేరిట రాష్ట్రంలోని అర్హులందరికీ రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని అందించనున్నన్నట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ పరిమితిని కూడా రూ.15 లక్షలకు పెంచనునన్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని ఇలాంటి హామీలను చూసిన ప్రతిపక్షాలకు నిద్రపట్టడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ గ్యారెంటీ హామీలను, మాయమాటలను ప్రజలెవరూ నమ్మడం లేదని అన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు కొత్తూరు ఉమామహేశ్వరరావు, కూసంపూడి మహేశ్, వనమా వాసు, మట్టా ప్రసాద్, కంటే నాగలక్ష్మి, గఫార్, వీరపనేని రాధిక బాబీ తదితరులు పాల్గొన్నారు. కాగా, తొలుత హనుమాన్ టెంపుల్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు.
కాగా, తెలంగాణ ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే బతుకమ్మ, గౌరమ్మలపై కాంగ్రెస్ నాయకుడు జీవన్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఎమ్మెల్యే సండ్ర మండిపడ్డారు. రాజకీయంగా విమర్శలు చేయవచ్చుగానీ.. తెలంగాణ ఆడబిడ్డల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదని అన్నారు.