ఖమ్మం సిటీ, ఫిబ్రవరి 25: కట్టుకున్న గూడును కూల్చివేశారు. ఇంటిల్లిపాదినీ నడిరోడ్డు మీదకు తెచ్చారు. చిన్నారుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేశారు. గుక్కెడు మంచినీళ్లూ ఇచ్చే దిక్కు లేదు. బుక్కెడు బువ్వ పెట్టే నాథుడు లేడు. దీంతో సహనం నశించి రోడ్డెక్కిన పేదలపై కాంగ్రెస్ సర్కారు కర్కశత్వం కొనసాగుతూనే ఉంది. న్యాయం చేయాలని అడగడమే మహా పాపంగా భావించి ఖాకీలతో కుళ్ల బొడిపిస్తున్నది. బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్టు చేయిస్తున్నది. ఖమ్మం నడిబొడ్డున బుధవారం జరిగిన పేదల ధర్నా వారి ఆకలి కేకలకు దర్పణంగా నిలిచింది.

ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల ప్రాంతంలోని భూదాన్ భూముల్లో పదేళ్లుగా వందలాది మంది అభాగ్యులు గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. యావత్ తెలంగాణ వ్యాప్తంగా పేదల ఆవాసాల కూల్చివేతలకే ప్రాధాన్యమిస్తున్న రేవంత్ సర్కార్ ఖమ్మంలోనూ అదే విధానాన్ని అవలంబించింది. ఎలాంటి నోటీసూ ఇవ్వలేదు. ప్రత్యామ్నాయ జీవనాన్ని చూపించలేదు. రెండు రోజుల క్రితం తెల్లవారుజామున వందలాది మంది పోలీసులు, పారా మిలటరీ బలగాలను మోహరింపజేచి జేసీబీలు, బుల్డోజర్ల సాయంతో భూదాన్ భూముల్లోని ఇండ్లను కూల్చివేశారు. ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో బాధితులందరినీ తీసుకొచ్చి ఖమ్మంలోని అంబేద్కర్ భవనంలో, టీటీడీసీ భవనంలో పడేసి వెళ్లారు.
పశువుల కొట్టంలో పడేసిన మాదిరిగా పేదలను బలవంతంగా తీసుకొచ్చిన అధికారులు ఎలాంటి సౌకర్యాలూలేని భవనాల్లో ఉంచారు. తాగేందుకు నీళ్ల వసతి కూడా ఏర్పాటు చేయలేదు. వండుకుని తిందామంటే గిన్నెలు, సామగ్రి అంతా ధ్వంసం చేశారు. రెండు రోజుల నుంచి చంటి బిడ్డలను పెట్టుకుని ఆపన్నహస్తం కోసం ఎదురుచూసినా ఏ ఒక్కరూ పలకరించిన పాపాన పోలేదు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లకుండా చదువుకు దూరమవుతున్నారు.

ఈ విపత్కర పరిస్థితికి విసుగెత్తిన భూదాన్ భూముల బాధితులు పలు రాజకీయ పార్టీలు, సంఘాల సహకారంతో ఖమ్మంలోని టీటీడీసీ భవనం ఎదురుగా రోడ్డెక్కారు. వారి దుస్థితికి కారణమైన కాంగ్రెస్ సర్కారును తమ నినాదాలతో చీల్చి చెండాడారు. ఎర్రని ఎండను సైతం లెక్క చేయకుండా ఆందోళనకు దిగారు. ‘సీఎం రేవంత్రెడ్డి డౌన్డౌన్.. ఖమ్మం మంత్రులు దొంగలు..’ అని తీవ్ర ఆరోపణలు చేస్తూ కన్నెర్ర జేశారు. ‘మా ఇళ్లను కూలుస్తామని ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు?’ అంటూ ప్రశ్నించారు. తక్షణమే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
గత పదేళ్లలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంలో ఏనాడూ తమకు ఇలాంటి సమస్య రాలేదని గుర్తుచేశారు. నీళ్లు, కరెంట్ కూడా ఇచ్చారని జ్ఞప్తికి తెచ్చుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతోనే తమకు దరిద్రం పట్టిందని వాపోయారు. దాదాపు గంటసేపు రోడ్డుకు అడ్డంగా బైఠాయించి కాంగ్రెస్ సర్కార్ను కడిగి పారేశారు. నమ్మి ఓట్లేసిన పాపానికి తమ బతుకులను రోడ్డు పాలు చేశారంటూ రోదించిన తీరు హృదయ విదారకంగా మారింది.
