ఊపందుకుంటున్న ‘నైరుతి’
భద్రాద్రి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం
అత్యధికంగా దుమ్ముగూడెంలో 45.4 మి.మీ,
అత్యల్పంగా పినపాకలో 5.4 మి.మీ నమోదు
చెరువులు, కుంటల్లోకి వరదనీరు
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 3 (నమస్తే తెలంగాణ)/ పాల్వంచ/ ములకలపల్లి/ జూలూరుపాడు: భద్రాద్రి జిల్లాలో ఆదివారం పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండకాసి ఆ తర్వాత మబ్బులుపట్టాయి. అప్పుడు మొదలైన వర్షం రాత్రి వరకు కొనసాగింది. అప్పటి వరకు ఉక్కపోతతో అల్లాడిన జనం వాతావరణం చల్లబడడంతో ఉపశమనం పొందారు. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చెరువులు, కుంటల్లోకి వరదనీరు చేరింది. పాల్వంచలోని జాతీయ రహదారిపై వరద నీరు చేరడంతో వాహన రాకపోకలకు ఇబ్బంది కలిగింది.
బస్టాండ్లోకి వెళ్లే మార్గంలో వరదనీరు చేరడంతో ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడ్డారు. ములకలపల్లి మండలంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. కమలాపురం వద్ద పాములేరు వాగు పొంగి ప్రవహించింది. వాహన రాకపోకలు నిలిచిపోయాయి. సూరంపాలెం, చలమన్ననగర్ మధ్య గాడెపు వాగు వరదనీటితో ప్రవహిస్తున్నది. చుంచుపల్లి మండలంలోని రుద్రంపూర్, గౌతంపూర్, ధన్బాద్, జూలూరుపాడు మండలంలోని గుండెపుడి, పాపకొల్లు, కాకర్ల, పడమట నర్సాపురం గ్రామాల్లో కుండపోతగా వర్షం కురిసింది. మరోవైపు వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పత్తి విత్తనాలు నాటిన చెలకల్లో ఇప్పటికే మొలకలు వచ్చాయి. వానలు ఊపందుకోనుండడంతో సాగు పనులు ముమ్మరమయ్యాయి.
వర్షపాతం ఇలా..
దుమ్ముగూడెంలో మండలంలో అత్యధికంగా 45.4 మిల్లీమీటర్లు అత్యల్పంగా పినపాకలో 5.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. చర్లలో 19.2 మి.మీ, అశ్వాపురం 11.8, మణుగూరు 17.4, గుండాల 7.2, ఇల్లెందు 20.0, టేకులపల్లి 32.0, జూలూరుపాడు 34.2, చండ్రుగొండలో 20.2, కొత్తగూడెం 15.0, పాల్వంచ 28.8, బూర్గంపాడు 22.2, భద్రాచలం 17.8, ములకలపల్లి 26.4, దమ్మపేట 7.6, అశ్వారావుపేట 14.6 మి.మీ వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా సగటున 20.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.