ఖమ్మం, జనవరి16 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి) : దేశ ప్రజలను జాగృతం చేసేలా ఈ నెల 18న ఖమ్మంలో భారతీయ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ ఉండబోతున్నది. తెలంగాణ తరహా అభివృద్ధిని దేశం యావత్తు కోరుకుంటున్న సమయంలో బీఆర్ఎస్ సభ కీలకం కానున్నది. అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఈ నెల 18వ తేదీన ఖమ్మంలో బీఆర్ఎస్ నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లు, తదితర అంశాలపై మంత్రి ‘నమస్తే తెలంగాణ’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఖమ్మం సభపై దేశం యావత్తూ దృష్టిసారించిందని అతిరథ మహారథులు హాజరయ్యే ఈ సభ బీఆర్ఎస్ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోనున్నది. గ్రామగ్రామాన గడప గడపకూ పార్టీ శ్రేణులు జనాన్ని తరలించేందుకు సిద్ధమయ్యారు. ఖమ్మం సభపై దేశం యావద్దు దృష్టి సారించిందని అతిరధ మహారధులు హాజరయ్యే ఈ సభ బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోనుందని, గ్రామగ్రామాన గడపగడపకూ పార్టీ శ్రేజులు జనాన్ని తరలించేందుకు సిద్ధమయ్యారు.
నమస్తే : సభా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి?
మంత్రి పువ్వాడ : ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నాం. వంద ఎకరాల సువిశాల స్థలంలో కనీవినీ ఎరుగని రీతిలో సభ నిర్వహిస్తున్నాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాం. సభకు వచ్చే ప్రతి ఒక్కరూ సభను ఆద్యంతం తిలకించేలా ఎల్ఈడీ టీవీలు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు నేతృత్వంలో సభా ఏర్పాట్లను పూర్తి చేశాం. భారీ కేడ్లు ఏర్పాటు చేయడంతోపాటు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటితో సహా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
నమస్తే తెలంగాణ : పెద్ద సంఖ్యలో వాహనాలు వచ్చే అవకాశం ఉంది. పార్కింగ్ ఏర్పాట్లు ఏవిధంగా చేశారు?
మంత్రి : బహిరంగ సభకు వచ్చే ప్రజలు కాలినడక దూరంలో సభాస్థలికి చేరుకునేలా ఈ సారి ప్రత్యేక దృష్టిసారించాం. ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వారికి సభాస్థలి సమీపంలోనే పార్కింగ్ ఏర్పాట్లు చేశాం.448 ఎకరాల్లో 20 ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశాం. ప్రతిచోట నుంచి కాలినడకన వచ్చే విధంగా సునాయసంగా సభకు చేరుకునేలా ఏర్పాట్లు చేశాం.
నమస్తే తెలంగాణ : ఏఏ ప్రాంతాల నుంచి సభకు ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది.?
మంత్రి : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలతోపాటు మహబూబమాబాద్ జిల్లా, డోర్నకల్, మహబూబాబాద్, జనగామ జిల్లా పాలకుర్తి, సూర్యాపేట జిల్లా సూర్యాపేట కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి ప్రాంతాల నుంచి పార్టీశ్రేణులు, బీఆర్ఎస్ అభిమానులు తరలించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతోపాటు ప్రజాప్రతినిధులను, నాయకులను, నియోజకవర్గ ఇన్చార్జీలుగా నియమించింది.
నమస్తే తెలంగాణ : బీఆర్ఎస్ సభ లక్ష్యం ఏమిటి..?
మంత్రి : రెండు సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాటు చేయడానికి ప్రజలు భారీ మెజారిటీతో అవకాశం ఇచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం ఇతర రాష్ర్టాల ప్రజలను ఆకట్టుకుంటోంది. దేశప్రజల కష్టాల్లో భాగస్వామ్యం కావాలని నిధులు, సహజ వనరులకు దేశంలో కొదువ లేకపోయినా వాటిని వినియోగించడంలో బీజేపీ వైఫల్యం చెందింది. దేశంలో రైతు ప్రభుత్వం ఏర్పడాలని లక్ష్యమే బీఆర్ఎస్ సభ నిర్వహణ ప్రధాన ఉద్దేశం.
నమస్తే తెలంగాణ : ఈ సభకు ఎవరెవరు రానున్నారు?
మంత్రి : బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగే ఖమ్మం సభలో కాంగ్రెస్, బీజేపీయేతర రాజకీయ ఉద్దండులు వేదికను పంచుకోనున్నారు. అమ్ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మాన్, సీపీఎంకు చెందిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా, సమాజ్వాద్ పార్టీ అధినేత, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ నేత పువ్వాడ నాగేశ్వరరావు తదితరులు హాజరుకానున్నారు. అన్ని జిల్లాల రాష్ట్ర మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎంపీలు, శాసన సభ్యులు పాల్గొననున్నారు.
నమస్తే తెలంగాణ : సభకు స్పందన ఎలా ఉంది.?
మంత్రి : ఇప్పటికే ప్రతి నియోజకవర్గం నుంచి 50 వేలు తగ్గకుండా పార్టీశ్రేణులు సభకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. నేను ఊహించిన దానికంటే అత్యధికంగా గ్రామాల నుంచి స్పందన లభిస్తున్నది. ఎంతమంది వచ్చినా వారికి కావాల్సిన ఏర్పాట్లు, వాహనాలను సమకూర్చేందుకు నియోజకవర్గాల వారీగా ప్రయత్నిస్తున్నాం.