చింతకాని: పసుపు, జామ, శ్రీగంధం, తీగజాతి కూరగాయాలు, మామిడి, ఆయిల్ఫామ్ తదితర ఉద్యానవన తోటల్లో సరైన యాజమాన్య పద్దతులు అవలంభించడం ద్వారా రైతాంగం అధిక దిగుబడులు సాధించవచ్చని రాష్ట్ర సూక్ష్మసేద్యపథకం ప్రత్యేకాధికారి, డిప్యూటి డైరక్టర్ విజయలక్ష్మి అన్నారు. మండల పరిధిలో వందనం, నరసింహపురం గ్రామాల్లో ఉద్యాన పంటల్లో సూక్ష్మసేద్య పథకాలతోపాటు ఉద్యాన పంటలను ఆమె పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం స్ధానిక రైతులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సబ్సీడీపై పలు పథకాలున్నాయని వాటిని రైతులు సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించాలని అన్నారు. పూలు, పండ్ల మొక్కలు, పట్టుపురుగుల పెంపకం ద్వారా రైతులు అతి తక్కువ సమయం, తక్కువ ఖర్చు, ప్రభుత్వ సబ్సీడీలు ఉపయోగించుకుని అధిక దిగుబడులు పోందాలని స్ధానిక రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారిణి జీ అనసూయ, వైరా, మధిర నియోజకవర్గాల హర్టికల్చర్ అధికారి ఆకుల వేణు, ఇంజనీర్ పీ నాగమణి, డ్రిప్ కంపెరనీల ప్రతినిధులు, స్ధానిక గ్రామాల రైతులు, రైతుసమన్వయసమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.