భద్రాచలం, ఆగస్టు 28 : పవిత్రోత్సవాల్లో భాగంగా భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం సీతారామ, లక్ష్మణమూర్తులకు పవిత్రారోపణం నిర్వహించారు. తొలుత స్వామివారి ఉత్సవమూర్తులను బేడా మండపంలో ఆశీనులను చేసి.. 108 కలశాలకు పూజలు నిర్వహించి, వేద విన్నపాలు చేసి ఉత్సవమూర్తులకు అష్టోత్తర శత కలశాభిషేకం, తులసి మాలలు, హరిద్రాచూర్ణం, సహస్రధారలతో పంచోపనిషత్తు మంత్రాలతో ప్రత్యేక అభిషేకం జరిపారు. తర్వాత ఆ పవిత్రాలను ప్రధానాలయం నుంచి తీసుకొచ్చి ఆచార్యుని శిరస్సుపై కొన్ని పవిత్రాలను ఉంచి ఆలయ ప్రదక్షిణ చేసి వాటికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అంతరాలయంలోని మూలవరులకు పవిత్రాలను ధరింపజేశారు.
స్వామివారి ఉత్సవ మూర్తులకు, నిత్య కల్యాణమూర్తులకు, ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న ఉపాలయాల్లోని దేవతామూర్తులకు, ఆంజనేయస్వామివారికి, లక్ష్మీతాయారమ్మవారికి, ఆండాళ్ తల్లికి, కణ్ణన్ స్వామివారికి, హయగ్రీవస్వామి తదితర దేవతామూర్తులకు, పరివార దేవతలకు పవిత్రాలను అలంకరించారు. చివరికి రామాలయానికి, బలిపీఠానికి, ధ్వజస్తంభానికి, ఆలయ గోపురంపై ఉన్న సుదర్శన చక్రానికి పవిత్రాలను ధరింపజేశారు. పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్న ఆచార్య, బ్రహ్మ, ఋత్విక్లు, అర్చక స్వాములు సైతం మెడలో పవిత్రాలను ధరించారు. మంగళవారం నుంచి మూడు రోజులపాటు యాగశాలలో హోమాలు నిర్వహిస్తారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి, ఆలయ అధికారులు, ఆచార్య, బ్రహ్మ, ఋత్విక్లు, వేద పండితులు పాల్గొన్నారు.
భద్రాచలం, ఆగస్టు 28 : భద్రాచలం సీతారామచంద్రస్వామివారికి భక్తులు సమర్పించిన శ్రీరామ కోటి పుస్తకాలను సోమవారం వైభవంగా నిమజ్జనం చేశారు. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో రాసిన రామకోటి పుస్తకాలను భద్రాద్రి రామయ్యకు సమర్పిస్తారు. అయితే ఆలయ అధికారులు వాటిని భాండాగారంలో భద్రపరిచి ఏటా శ్రావణ మాసంలో గోదావరి నదిలో నిమజ్జనం చేస్తారు. అందులో భాగంగా శ్రావణ సోమవారం రెండు లారీల్లో తీసుకొచ్చిన శ్రీరామకోటి పుస్తకాలను నిమజ్జనం చేశారు.