భక్తులకు అత్యంత పవిత్ర మాసం.. కార్తీక మాసం.. ఉపవాస దీక్షలు చేసేవారు.. తీర్థ యాత్రలకు వెళ్లేవారు.. మాలధారణ స్వీకరించే వారు.. నదీ తీరాల్లో పవిత్ర స్నానాలు ఆచరించేవారు.. నోములు నోచుకునే వారంతా ఈ మాసం కోసమే ఎదురుచూస్తారు.. మహిళలు ఆలయాలు, ఇంటి బయట దీపాలు ఉంచుతారు. దీపారాధన చేస్తారు.. పిల్లా పాపలతో వన భోజనాలకు వెళ్లి సంతోషంగా వేడుకలు నిర్వహిస్తారు.. అందుకే కార్తీక మాసం ఎంతో ప్రత్యేకం. బుధవారం నుంచి మొదలయ్యే ఈ మాసం వచ్చే నెల 8న వచ్చే కార్తీక పౌర్ణమితో ముగుస్తుంది.
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): భక్తులకు అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఉపవాస దీక్షలు చేసే భక్తులు కార్తీక మాసం కోసమే ఎదురుచూస్తారు. బుధవారం నుంచి మొదలయ్యే ఈ మాసం వచ్చే నెల 8వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ మాసంలో మహిళలు నెలరోజుల పాటు ఆలయాలతో పాటు ఇంటి ఎదుట దీపాలు వెలిగిస్తారు. ఉపవాస దీక్షలు చేస్తారు. మూకుమ్మడిగా వన భోజనాలకు వెళ్తారు. జిల్లా కేంద్రంలోని గణేశ్ టెంపుల్, ప్రగతి నగర్ శివాలయం, బూడిడగడ్డ శివాలయం, రుద్రంపూర్ శివాలయం, చుంచుపల్లి, సుజాతనగర్ పాత శివాలయంలో భక్తులు పూజలు చేయనున్నారు. ఆలయ నిర్వాహకులు భక్తుల కోసం సౌకర్యాలు కల్పిస్తున్నారు. భద్రాచలంలోని గోదావరిలో పవిత్ర స్నానమాచరించేందుకు తెలుగు రాష్ర్టాల నుంచి భారీగా భక్తులు తరలిరానున్నారు.
తీర్థ యాత్రలకూ ఇదే సీజన్..
కార్తిక మాసంలో ఎక్కువ మంది భక్తులు తీర్థాలకు వెళ్తారు. దూర ప్రాంతాల్లోని పురాతణ ఆలయాలకు వెళ్లి వ్రతాలు చేస్తారు. నోములు నోచుకుంటారు. జిల్లావాసులు ఎక్కువగా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం, ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ తదితర పట్టణాల్లోని పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తుంది. ప్రైవేటు బస్ యజమానులు సర్వీసులు నిర్వహిస్తారు.
మాలాధారణ స్వీకరించనున్న స్వాములు..
భక్తులు తమ ఇష్టదైవాల మాలధారణ సీజన్ కార్తిక మాసమే. ఈ సీజన్లో ఎంతోమంది అయ్యప్ప, భవానీ, సాయి, శివుడు, ఆంజనేయస్వామి మాలలు ధరిస్తారు. ఈ మాసంలో ఆయా ఆలయాలు భక్తులతో కిటకిటలాడతాయి. ఆలయ నిర్వాహకులు మాలధారుల కోసం వసతులు కల్పిస్తారు.