భద్రాద్రి కొత్తగూడెం, జూలై 21 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి జిల్లాలో మంగళవారం కురిసిన వర్షం రైతన్నలకు ఊరటనిచ్చింది. కొన్నిచోట్ల భారీ వర్షం కురవగా.. మరికొన్నిచోట్ల మోస్తరు వర్షం పడింది. ఇప్పటికే పత్తి పంట వేసి వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఉపశమనం కలిగింది. ఇల్లెందులో 3 సెంటీమీటర్ల వర్షం పడగా.. దమ్మపేట, పాల్వంచ, సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది.
చర్ల, జూలూరుపాడు, మణుగూరు, టేకులపల్లి మండలాల్లో జల్లులు పడ్డాయి. మరో రెండు మంచి వర్షాలు కురిస్తే పత్తి మొక్కలకు ఊపిరి పోసినట్లవుతుందని రైతులు చెబుతున్నారు. అన్నపురెడ్డిపల్లి, దమ్మపేట, చుంచుపల్లి, చండ్రుగొండ మండలాల్లో 3 నుంచి 2 సెంటీమీటర్ల లోపు వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
చర్ల, జూలై 21: ఎగువన ఛత్తీస్గఢ్ అడవుల్లో కురిసిన భారీ వర్షాలకు చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన డ్యాం అధికారులు 15 గేట్లు అడుగు మేర గేట్లు ఎత్తి 10,738 క్యూసెకుల నీటిని దిగువనున్న గోదావరిలోకి వదిలారు. ప్రాజెక్టు ఎగువ నుంచి ఇంకా ఎకువ నీరు వచ్చే అవకాశం ఉన్నందున సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు అధికారులు తెలిపారు.