ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 23: గత నెలలో కురిసిన అకాల వర్షం మక్కపంటను ముంచింది. రైతులకు నష్టాలను మిగిల్చింది.. జిల్లాలోని మధిర, బోనకల్లు మండలాల పరిధిలో నష్ట తీవ్రత ఎక్కువగా కనిపించింది. సీఎం కేసీఆర్ రైతుల కష్టాన్ని చూసి ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. అన్నమాట ప్రకారం ఆ మేరకు నిధులు విడుదల చేశారు. గత నెలలో వేలాది ఎకరాల్లో పంటలను దెబ్బతీసిన వరుణుడు మళ్లీ ఆగ్రహించాడు. ఆదివారం జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పలుచోట్ల వడగండ్లు రాలి పడ్డాయి.
వాన ధాటికి మధిర, వైరా నియోజకవర్గాల్లో పండిస్తున్న మక్క పంట నేలవాలింది. పంట చేతికి వచ్చే సమయంలో వాన పంటను దెబ్బతీయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం నగరంతో పాటు చింతకాని, ఖమ్మం రూరల్, కూసుమంచి, తిరుమలాయపాలెం తదితర మండలాల్లో వర్ష తీవ్రత ఉంది. వడగండ్ల కారణంగా పలుచోట్ల ఇండ్లపై కప్పుపై సిమెంట్ రేకులకు చిల్లులు పడ్డాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్ద అయింది.