ఖమ్మం వ్యవసాయం, జనవరి 8 : ఎండుమిర్చి ధర రోజురోజుకూ పతనమవుతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన వారంరోజుల క్రితం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజారకం ఎండుమిర్చి ధర క్వింటాల్ రూ.23,600 పలుకగా, వారంరోజుల వ్యవధిలోనే జెండాపాటలో అదే రకం పంట రూ.21 వేలకు పడిపోయింది. రెండురోజుల సెలవుల అనంతరం సోమవారం నగర వ్యవసాయ మార్కెట్లోని మిర్చియార్డుకు ఆయా జిల్లాల నుంచి రైతులు సుమారుగా 20 వేల మిర్చి బస్తాలను తీసుకొచ్చారు. గతవారం మంచి ధర పలకడంతో ఇదే అదునుగా భావించిన రైతులు పెద్దఎత్తున పంటను తీసుకొచ్చారు. ఏంజరిగిందో తెలియదుకానీ సోమవారం ఉదయం జరిగిన జెండాపాటలో గరిష్ఠ ధర క్వింటాల్ ఒకే ఒక్క లాట్కు రూ.21 వేలు పలికింది. మధ్య ధర క్వింటాల్ రూ.18,500 కాగా, కనిష్ఠ ధర క్వింటాల్ రూ.7 వేలు చొప్పున ఖరీదుదారులు పంటను కొనుగోలు చేశారు. యార్డుకు పంటను తీసుకొచ్చిన రైతుల్లో సుమారు 80శాతం మంది పంట క్వింటాల్ రూ.15 నుంచి రూ.16 వేలు మాత్రమే పలికింది.
దీంతో ఎన్నోఆశలతో పంటను యార్డుకు తీసుకొచ్చిన రైతులకు తీవ్ర నిరాశే మిగిలింది. ధర నచ్చకపోవడంతో కొందరు రైతులు తిరిగి ఇంటికి పంటను తీసుకుపోయారు. మరికొందరు చేసేదిలేక ధర నచ్చకపోయినప్పటికీ తప్పనిసరి పరిస్థితిలో అమ్ముకున్నారు. కొద్దిమంది పంటను ఖరీదుదారులు కొనుగోలు చేయకపోవడంతో యార్డులోనే ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లావ్యాప్తంగా కోల్డ్స్టోరేజీలు సైతం ఖాళీ అయ్యాయి. దీంతో ఈ సంవత్సరం మిర్చిపంటకు మంచి ధర పలుకుతుందని ప్రతిఒక్కరూ భావించారు. అయితే సీజన్ ఆరంభంలోనే ఎర్రబంగారం ధర పతనం అవుతుండడంతో సాగు చేసిన రైతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మిర్చిధరల తగ్గుదలకు కారణం ఎగుమతులు లేకనా? ఖరీదుదారులు సిండికేట్ దందాకు తెరలేపారా అన్నది తేలాల్సి ఉంది.
మార్కెట్లో ఇంత తక్కువ ధర పలకడానికి మార్కెట్ వర్గాలు ఒక్కొక్కరూ ఒక్కో కారణం చెబుతున్నారు. గడిచిన వారంలో పంట నాణ్యతతో సంబంధం లేకుండా ఇంతకంటే పచ్చిగా ఉన్నప్పటికీ ధర ఎందుకు పెట్టారని రైతులు వ్యాపారులను నిలదీశారు. ఎక్కువ మొత్తంలో పంట తీసుకొచ్చిన తరువాత ధర కావాలని తగ్గించారని రైతులు ఆరోపించారు. మొదటి నుంచి ధర తక్కువగా ఉంటే ఇంటిదగ్గరనే పెట్టుకొని నచ్చిన రేటు వచ్చిన తరువాత అమ్ముకునేవాళ్లమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వ్యాపారులు మాత్రం మరోవిధంగా సమాధానం ఇస్తున్నారు. విదేశాలకు పూర్తిగా ఎగుమతులు లేకపోవడంతో ఇక్కడి వ్యాపారులు మాత్రమే పంటను కొనుగోలు చేస్తున్నారని అంటున్నారు. రైతులు తీసిన పంటను తీసినట్టుగానే మార్కెట్కు తీసుకొస్తున్నారని వ్యాపారులు తెలిపారు. దీంతో పంట నాణ్యత పూర్తిగా తగ్గిపోవడం ద్వారా సైతం ధరలు తగ్గినట్లు చెబుతున్నారు. ఏదేమైనా వారంరోజుల వ్యవధిలోనే క్వింటాకు ఒక్కంటికి దాదాపుగా నాలుగు వేలు తగ్గడం పట్ల రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు.
వ్యాపారులు సిండికేట్గా మారి పంటను కొనుగోలు చేసి నిల్వ పెట్టుకుంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు పంటల దిగుబడి గణనీయంగా పడిపోవడం, మరోవైపు మిర్చి ధరలు పతనంకావడంతో మిర్చి రైతులు ఈ ఏడాది అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయంగా కనిపిస్తున్నది. సంక్రాంతి తర్వాత ఎగుమతులు ప్రారంభమైతే మిర్చి ధర పెరుగుతుందని రైతులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఎండుమిర్చి ధర దారుణంగా పడిపోతున్నది. సీజన్ ఆరంభంలో ఖమ్మం మార్కెట్లో జెండాపాట రూ.23,600 పలికిన క్వింటాల్ మిర్చి రూ.21 వేలకు దిగజారింది. దీంతో మిర్చిరైతుల సంతోషం వారంరోజులకే ఆవిరైపోతున్నది. పేరుకే గరిష్ఠ రేటు.. కానీ కొనేది రూ.15 నుంచి రూ.16 వేలకు మాత్రమే. అసలే ఈ ఏడాది దిగుబడి లేక దిగాలు చెందుతున్న రైతన్నలు ధరల పతనంతో మరింత కుంగిపోతున్నారు. అయితే ధరలు పడిపోవడానికి కారణం ఎగుమతులు లేకపోవడమా? వ్యాపారులు సిండికేట్గా మారడమా? అనేది అర్థంకావడం లేదు. వ్యాపారులే పంటను కొని నిల్వ పెట్టుకుంటున్నారనే ఆరోపణలు మాత్రం వినిపిస్తున్నాయి. ఏదేమైనా మార్కెట్కు తెచ్చిన మిర్చిపంటను తిరిగి ఇంటికి తీసుకెళ్తున్నారంటే రైతుల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఈ రోజు 12 మిర్చి బస్తాలను మార్కెట్కు తీసుకొచ్చాను. జెండాపాట తర్వాత నా పంటను వ్యాపారులు క్వింటా ఒక్కంటికి రూ.15 వేలకు అడిగారు. మా కమీషన్ వ్యాపారి ఎంత ప్రయత్నం చేసినా అంతకంటే ధర ఎక్కువ పెట్టలేదు. మొన్నటి ధరను చూసి పంట తీసుకొచ్చా. మరీ అంతతక్కువకు అడగడంతో తిరిగి ఇంటికి పంటను తీసుకెళ్తున్నాను. ఆరబెట్టి మళ్లీ ధర పెరిగిన తర్వాత తెస్తాను.
గతంలో ఎప్పుడు ఇలాంటి ఇబ్బంది పడలేదు. ఈ సంవత్సరం నా సొంతభూమి ఎకరంన్నరలో మిర్చితోట సాగు చేశాను. ఇప్పటివరకు కేవలం నాలుగు బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చింది. మహా అయితే మరో రెండు బస్తాలు రావచ్చు. దాదాపు రూ.లక్ష పెట్టుబడి పెట్టాను. ఈ రోజు నాలుగు బస్తాలను మార్కెట్కు తీసుకొచ్చాను. షావుకారులు క్వింటాల్ రూ.15,500 ధర పెట్టారు. పెంచమని ఎంత వేడుకొన్నా ధర పెట్టలేదు. ఏమి చేయలేక పంటను అమ్మాను. అటు పంటకు రోగం వచ్చి ఆగమయ్యింది. ఇటు మార్కెట్లో ధర లేదు. చాలా బాధగా ఉంది. ఏమి చేయాలో అర్థంకావడం లేదు.