అశ్వారావుపేట, డిసెంబర్ 13 : తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల సరిహద్దు పూర్తిగా అటవీప్రాంతంలో ఉన్న గుబ్బుల మంగమ్మ ఆలయం భక్తుల కోర్కెలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి చెందింది. ఆలయంపై జాలువారే జలపాతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. ప్రకృతి సోయగాల మధ్య పచ్చని వాతావరణం భక్తులకు పారవశ్యంతోపాటు ఆహ్లాదానిస్తున్నది. అమ్మవారి సేవలో కొండరెడ్ల గిరిజనులు పూజలు చేయడమే కాకుండా భక్తులకు సేవలు అందిస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా స్వయంభువుగా వెలిసిన గుబ్బుల మంగమ్మ తల్లి ఆలయం పర్యాటక కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతున్నది. ప్రతిఏటా లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం సరిహద్దులోని దట్టమైన అటవీప్రాంతంలో గుబ్బుల మంగమ్మ తల్లి శతాబ్దాల క్రితం స్వయంభుగా వెలిసి భక్తులకు దర్శనమిస్తున్నది. కోర్కెలు తీర్చే ఆరాధ్యదైవంగా భక్తులకు నిత్యం అమ్మవారు దర్శనమిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల వ్యాప్తంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. నిత్యం దర్శనమిచ్చే అమ్మవారికి ప్రతి ఆదివారం, బుధవారం రోజు భక్తులు అధికసంఖ్యలో మొక్కులు తీర్చుకునేందుకు తరలివస్తారు.
గుబ్బుల మంగమ్మ తల్లి ఆలయం రాష్ట్ర విభజనకు ముందు పూర్తిగా తెలంగాణ ప్రాంతానికి చెంది ఉంది. అశ్వారావుపేట మండలానికి చెందిన గిరిజనుల ఆధీనంలో పూజలు అందేవి. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వివాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం దేవాదాయశాఖ ఆలయాన్ని స్వాధీనం చేసుకుంది. సరిహద్దు వివాదం తీవ్రస్థాయికి చేరడంతో భద్రాచలం ఐటీడీఏ, ఏలూరు జిల్లా కన్నాపురం ఐటీడీఏ అధికారులు సమాలోచనల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి కేటాయించబడింది. అప్పటినుంచి జంగారెడ్డిగూడెం దేవాదాయశాఖ ఆలయ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నది.
దట్టమైన అటవీప్రాంతంలో ఆలయం ఉండడం వల్ల గిరిజనులే పర్యవేక్షిస్తున్నారు. పలు విజ్ఞప్తుల అనంతరం ఐటీఏడీ అధికారులు అటవీశాఖతో సమన్వయం చేసుకుని గిరిజనులకు ఉపాధి కల్పించే విధంగా దుకాణాలను ఏర్పాటు చేశారు. దీనివల్ల భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలు, సరుకులు అందుబాటులోకి వచ్చాయి. దుకాణాలు ఏర్పాటుతో గిరిజనులకు ఆర్థికభరోసా కలిగింది. కొన్ని దుకాణాలను భద్రాచలం ఐటీడీఏ ఏర్పాటు చేయగా మరికొన్ని దుకాణాలను కన్నాపురం ఐటీడీఏ అధికారులు ఆ ప్రాంత గిరిజనుల కోసం నిర్మించింది. దీంతో ఇరుప్రాంతాల గిరిజనులకు ఉపాధి అవకాశాలు లభించాయి.
గుబ్బుల మంగమ్మ ఆలయ సమీపంలోని గోగులపూడి గ్రామానికి చెందిన కొండరెడ్లే పూజారులు అమ్మవారికి సేవలు అందిస్తున్నారు. వారి ఆధ్వర్యంలోనే భక్తులకు పూజలు అందుతాయి. అమ్మవారి ఆలయాన్ని ఎండోమెంట్శాఖ స్వాధీనం చేసుకుంది. కొండరెడ్లకు దేవాదాయశాఖ వేతనాలు చెల్లిస్తుంది. వీరి భక్తులకు ప్రతిరోజు అందుబాటులో ఉంటారు. ఆదివారం, బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఈ రోజుల్లో భారీగా ఆలయానికి తరలివస్తారు.
దట్టమైన అటవీప్రాంతంలో ఉన్న గుబ్బుల మంగమ్మ ఆలయం అంతా ప్రకృతి అందాలతో భక్తులను ఆకర్షిస్తున్నది. ఆలయంలోకి ప్రవేశించేందుకు సుమారు 5 కిలోమీటర్ల ముందే అటవీ మార్గం ప్రారంభమవుతుంది. పచ్చని ప్రకృతి అందాలు భక్తులకు స్వాగతం పలుకుతాయి. మట్టి రోడ్డు గుండా ఆలయం వద్దకు భక్తులు చేరుకుంటారు. భారీ వృక్షాలు, పక్షుల కిలకిలలు, పెద్ద రాళ్లు, ఎత్తైన కొండలు, కాలిబాట పక్కనే పారే వాగు, ప్రశాంతమైన వాతావరణం భక్తులను కనువిందు చేస్తాయి. వేసవికాలంతోపాటు ఏడాది పొడవునా ఆలయంపై జాలువారే జలపాతం భక్తులు, పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నది. జలపాతం నుంచి వచ్చే శబ్దాలు సంగీతంలా భక్తులు ఆస్వాదిస్తుంటారు. జాలువారే జలపాతం కిందే భక్తులు స్నానాలు ఆచరించి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. ఆలయంపై పారే జలపాతం ఎక్కడ నుంచి వస్తుందో నేటికీ అంతుపట్టని రహస్యం.
తెలుగు రాష్ర్టాలకు సరిహద్దులో ఉన్న గుబ్బుల మంగమ్మ తల్లి ఆలయం పర్యాటక కేంద్రంగానూ దినదినాభివృద్ధి చెందుతున్నది. ఈ ఆలయం పచ్చని ప్రకృతి అందాలతో భక్తులకు దర్శననిస్తున్నది. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఐటీడీఏ అధికారులు అటవీశాఖ సహకారం కూడా తీసుకుంటున్నారు. మౌళిక సదుపాయాలతోపాటు ఆలయ దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ అధికారులు శరవేగంగా చర్యలు తీసుకుంటున్నారు.