తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగులకు నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించింది. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలో దూకుడు పెంచింది. ఐదేళ్లుగా వరుస ఉద్యోగ ప్రకటనల ద్వారా సర్కారు కొలువులను భారీగానే నింపింది. ఎస్ఐ, కానిస్టేబుల్, వీఆర్వో, ఫారెస్టు, ఏఈవో, పంచాయతీరాజ్ సెక్రటరీలు, వైద్యుల పోస్టులను భర్తీ చేసింది. ఇదే ఒరవడితో గ్రూప్స్ అభ్యర్థులకు దగ్గరగా ఉండేలా సెంటర్లను ఏర్పాటైన కొత్తగా ఏర్పాటు చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సైతం పరీక్షా కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురాగా.. ఈ నెల 16వ తేదీన పరీక్ష నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సకల ఏర్పాట్లు చేస్తున్నది. దీంతో గ్రూప్-1 అభ్యర్థుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షలు హైదరాబాద్ లేదా వరంగల్ కేంద్రాల్లో రాయాల్సి వచ్చేది. తెలంగాణ వచ్చాక ఆ పరిస్థితి మారిపోయింది. మన తెలంగాణ బిడ్డలు మన దగ్గరే పరీక్షలు రాయాలనే ఉద్దేశ్యంతో దూరభారం తగ్గించి వారికి సౌకర్యాలు కల్పించి రాష్ట్ర ప్రభుత్వం సత్తా చాటుకుంది. దీనికోసం కలెక్టర్ అనుదీప్ పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. తొలిసారిగా నిర్వహించే పరీక్షల్లో ఎక్కడా లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు 20రోజుల నుంచి అన్నిశాఖల అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి ముందుకెళ్తున్నారు. దీంతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సైతం పరీక్షల నిర్వహణపై టీసీ, వీసీ ద్వారా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
జిల్లాలో 8,851మంది అభ్యర్థులు..
గ్రూప్-1 పరీక్షల కోసం జిల్లాలో 8,851మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 23 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించేదుకు కలెక్టర్ అనుదీప్ సకల ఏర్పాట్లు చేయించారు. ఇందుకోసం ప్రత్యేక హెల్ప్డెస్క్ను కూడా ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలను కొత్తగూడెం-10, పాల్వంచ-8, లక్ష్మీదేవిపల్లి-4, సుజాతనగర్-1 ఏర్పాటు చేశారు. పరీక్షలకు 327 తరగతి గదులను కేటాయించారు. కలెక్టరేట్లో 08744-241950, 9392919743 వాట్సాప్ నంబర్ను అందుబాటులో ఉంచి 24గంటలు పని చేసేందుకు సిబ్బందిని కేటాయించారు.
పక్కాగా పరీక్షల నిర్వహణ..
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు 23మంది చీఫ్ సూపరింటెండెంట్స్తోపాటు 23 సహాయ లైజనింగ్ అధికారులు, 8రూట్లలో 8మంది లైజన్ ఆఫీసర్లను నియమించారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఫ్లైయింగ్ స్కాడ్తోపాటు జిల్లా అధికారిని నియమించారు. అన్ని ఏరియాల్లో సీసీ కెమెరాలు ఉంచారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
జిల్లాలో జరగడం సంతోషం
గతంలో మా సీనియర్లు గ్రూప్స్ రాయాలంటే హైదరాబాద్ వెళ్లాలి.. మన వల్లకాదులేరా అనేవాళ్లు. ఇప్పుడు మన జిల్లాలో జరుగుతున్నాయంటే నమ్మలేదు. తెలంగాణ వచ్చాక పోటీ పరీక్షలు చాలా ఇక్కడే జరిగాయి. గ్రూప్-1 జరగడం ఇదే మొదటిసారి. ప్రిపరేషన్కు కూడా అధికారులు కోచింగ్ కేంద్రాలు అందుబాటులో ఉంచారు. గ్రంథాలయం కూడా బాగా ఉపయోగపడింది.
– సాయికుమార్, సుజాతనగర్ మండలం
సొంత జిల్లాలో గ్రూప్-1 పరీక్ష
మన రాష్ట్రం, మన జిల్లా ఇక్కడే గ్రూప్-1 పరీక్ష రాసేందుకు రెడీ అయ్యాను. చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ పట్టుపడితే వదలరు.. అందుకే పోటీపరీక్ష ఎంత పెద్దదైనా ఎవరి దగ్గర వాళ్లే రాసుకునే అవకాశం కల్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ వెళ్లి పరీక్షలు రాశారు. చాలామంది అందుకే గ్రూప్స్కు ప్రిపేర్ కూడా కాలేదని చెప్పారు. ఇప్పుడు అన్ని పరీక్షలూ ఇక్కడే పెడుతున్నారు. – సీహెచ్ శ్యామ్, హౌసింగ్ బోర్డు, చుంచుపల్లి మండలం
గ్రూప్-1 పరీక్షలకు పక్కగా ఏర్పాట్లు
తొలిసారిగా జిల్లాలో నిర్వహించే గ్రూప్-1 పరీక్షలకు పక్కాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. 23 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. పకడ్బందీగా పరీక్షలను నిర్వహిస్తాం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచనలు, సలహాలతో ఏర్పాట్లు పూర్తిచేశాం. అన్నిశాఖల అధికారులతో ఇప్పటికే మూడుసార్లు సమావేశం నిర్వహించాం. అభ్యర్థులకు నియమ, నిబంధనలను తెలియజేస్తున్నాం.
– దురిశెట్టి అనుదీప్, కలెక్టర్