మామిళ్లగూడెం, ఫిబ్రవరి 19 : గ్రీవెన్స్ డేలో ప్రజలు తమ సమస్యలపై అందజేసిన వినతులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం గ్రీవెన్స్ డే(ప్రజావాణి) నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. అదేవిధంగా ప్రజాపాలన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వెనువెంటనే పరిషారం చూపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో శాఖల వారీగా అందిన దరఖాస్తులపై కలెక్టర్ సమీక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.సత్యప్రసాద్, డి.మధుసూదన్నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఆర్.సన్యాసయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు తుది ఓటరు జాబితా రూపొందించి విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్లో జిల్లా అధికారులతో ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రతివారం సమావేశాలు నిర్వహించి వారి సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. 18 ఏండ్లు నిండిన ప్రతిఒకరికీ ఓటరు జాబితాలో చోటుకల్పించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు బి.సత్యప్రసాద్, డి.మధుసూదన్నాయక్, ఖమ్మం, కల్లూరు ఆర్డీవోలు జి.గణేష్, అశోకచక్రవర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయనిర్మల, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్, మాస్టర్ ట్రైనర్లు కె.శ్రీరామ్, మదన్గోపాల్, కలెక్టరేట్ ఏవో అరుణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు రాంబాబు, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ స్వామి పాల్గొన్నారు.