రఘునాథపాలెం, ఫిబ్రవరి 13: ఖమ్మం జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ పడింది. జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో భాగంగా వీ వెంకటాయపాలెం వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేస్తూ ప్రకటించిన విషయం తెలిసిందే. అనతికాలంలోనే సంబంధిత అధికారులు ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు సోమవారం జేఎన్ఈయూ, ఓయూ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు ఖమ్మం వచ్చి ఆర్డీవో రవీంద్రనాథ్, రఘనాథపాలెం తహసీల్దార్ నర్సింహారావుతో కలిసి రఘునాథపాలెం మండలం కేంద్రంలోని ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. కొద్దిరోజుల క్రితం రెవెన్యూ అధికారులు రఘునాథపాలెం రెవెన్యూ జింకలతండా క్రాస్రోడ్డులోని సర్వే నంబర్ 30లో 15ఎకరాలను కళాశాలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు.
ఈ మేరకు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించేందుకు సోమవారం ప్రొఫెసర్లు ఖమ్మం వచ్చారు. స్థలాన్ని పరిశీలించిన ప్రొఫెసర్లు కళాశాల ఏర్పాటుకు అనుకూలంగా ఉందని, 100 ఎకరాలు కేటాయించాలని అధికారులను కోరినట్లు తెలిసింది. ఇంజినీరింగ్ కళాశాలతోపాటు హాస్టల్ సౌకర్యం, భవిష్యత్తులో యూనివర్సిటీ కూడా ఏర్పాటుకు అనుకూలంగా ఉండేవిధంగా ఉంటుందని, కనీసం 50 ఎకరాలకు తగ్గకుండా కేటాయించాలని అధికారులను కోరినట్లు తెలిసింది. దీనిపై ప్రొఫెసర్లు కలెక్టర్లు కలిసి విన్నవించినట్లు సమాచారం. దీనిపై సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. కళాశాల ఏర్పాటుకు అవసరమైన స్థలం లభిస్తే కేటాయింపులు పూర్తి చేసుకొని వచ్చే విద్యాసంవత్సరంలోనే కాలేజీ ఏర్పాటు చేసే విధంగా కసరత్తు జరుగుతున్నదని ప్రొఫెసర్లు ద్వారా తెలిసింది. కార్యక్రమంలో సర్వేయర్ శ్రీనివాస్, ఆర్ఐ ప్రసాద్ తదితరులు ఉన్నారు.