ఆదివారం అర్ధరాత్రి నుంచే ప్రారంభమైన ఏసుక్రీస్తు ఆరాధనలు. సోమవారం లోక రక్షకుడి అవతరణను పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన భక్తులు. భక్తిభావంతో ఏసయ్యను స్మరిస్తూ ప్రత్యేక పార్థనలు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే విద్యుద్దీపాలతో అలంకరించిన క్రీస్తు మందిరా లకు కుటుంబ సమేతంగా చేరుకున్న భక్తులు చర్చి ఫాదర్లు చెప్పే సూక్తులను విని తరించిపోయారు. కరుణ చూపు.. కరుణామయా.. అంటూ క్రీస్తును మదినిండా తలుస్తూ వేడుకున్నారు.
క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రధాన చర్చిలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. చర్చి ప్రాంగణాల్లో వేసిన క్రీస్తు జనన ఘట్టాలు, శాంతాక్లాజ్(క్రిస్మస్ తాత), పశువుల పాకలో క్రీస్తు జననం వంటి అలంకరణలు, స్టాళ్లు ఆకట్టుకున్నాయి. భక్తులు చర్చిలకు భారీగా తరలిరావడంతో సందడిగా మారాయి. ప్రజాప్రతినిధులు, మిత్రులు క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు చెప్పారు.