అఖిలపక్ష రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల సంయుక్త వేదిక, వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్య వేదిక, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన దేశవ్యాప్త గ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మె ఖమ్మం జిల్లాలో విజయవంతమైంది. ఈ సందర్భంగా ఆయా పార్టీలు, సంఘాల నాయకులు నిరసన ప్రదర్శనలు, రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. పలు వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్, మతతత్వ విధానాలను అనుసరిస్తూ కార్మికులు, కర్షకులు, ప్రజల హక్కులు ఖూనీ చేస్తోందని దుయ్యబట్టారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని విపక్ష పార్టీల నేతలు, కార్మిక, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.