రఘునాథపాలెం, జూలై 8:రూ.2 కోట్ల డ్వాక్రా సభ్యుల సొమ్ముతో ఓ గ్రామదీపిక ఉడాయించిన ఘటన ఖమ్మం నగరం పాండురంగాపురంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) సభ్యుల పేరిట బ్యాంకు రుణం తీసుకున్న సదరు గ్రామదీపిక.. ఆరు నెలల క్రితం కుటుంబంతో సహా గ్రామం నుంచి వెళ్లిపోయింది. సభ్యుల ఇళ్లకు బ్యాంకర్లు వచ్చి రుణాలు చెల్లించాలంటూ నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తాము తీసుకోని రుణాన్ని తామెలా చెల్లించాలంటూ సదరు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం పాండురంగాపురంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు తమ గోడును వెళ్లబోసుకున్నారు.
వారి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం పాండురంగాపురానికి గ్రామదీపిక జయ అదే ప్రాంతానికి చెందిన పది మంది మహిళలతో నాలుగేళ్ల క్రితం శాంతార సమాఖ్య గ్రూపును ఏర్పాటుచేసింది. బ్యాంకు రుణం ఇప్పిస్తానని చెప్పడంతో వారంతా తమ ఆధార్ కార్డులను, ఇంకా పత్రాలను ఆ గ్రామదీపికకు అందజేశారు. బ్యాంకు పత్రాలపై ఆమె చెప్పిన చోట సంతకాలను చేశారు. ఓ రోజు ఈ పదిమంది సభ్యులను ఆ గ్రామదీపిక వారి బ్యాంకుకు తీసుకెళ్లి బ్యాంకు అధికారులకు చూపించింది. అదే రోజున బ్యాంకు అధికారులతో మాట్లాడి సభ్యులందరికీ ఎవరి అకౌంట్లలో వారికి ఒక్కొక్కరికీ రూ.2 లక్షల చొప్పున రుణాన్ని జమ చేయించింది. ఆ నగదును డ్రా చేసి ఇస్తే మరుసటి రోజున గ్రామంలో సమావేశం పెట్టి ఎవరి నగదును వారికి తిరిగి అందజేస్తానని చెప్పింది.
దీంతో సభ్యులందరూ తమ ఖాతాల్లోని నగదును డ్రా చేసి గ్రామదీపికకు ఇచ్చారు. ఆ మరుసటి రోజు సమావేశం ఏర్పాటుచేయలేదు. సభ్యులు అడిగినప్పుడల్లా ‘రేపు మాపు’ అంటూ రోజులు గడిపింది. మొత్తం రూ.20 లక్షలను సొంతానికి వినియోగించుకుంది. ఇలా ఇంకా అనేక ఎస్హెచ్జీ గ్రూపుల రుణాలను కూడా సొంతానికి వాడుకున్న సదరు గ్రామదీపిక.. ఆరు నెలల క్రితం కుటుంబంతో సహా ఈ గ్రామం నుంచి వెళ్లిపోయింది. అయితే, సదరు బ్యాంకర్లు ఇటీవల శాంతార గ్రూపు సభ్యుల ఇళ్లకు వెళ్లి రుణం చెల్లించాలంటూ నిలదీస్తున్నారు. తాము తీసుకోని రుణాన్ని తామెలా చెల్లించాలని, నాలుగేళ్లుగా రాని బ్యాంకర్లు గ్రామదీపిక పరారీలో ఉన్న ఈ సమయంలో వచ్చి తమను నిలదీయడమేంటని సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సదరు గ్రామదీపిక ఏర్పాటుచేసిన అనేక గ్రూపులకు బ్యాంకర్లు రుణాలు మంజూరు చేశారని, సభ్యులు నాలుగైదేళ్లుగా రుణాన్ని తిరిగి చెల్లించకపోయినా బ్యాంకర్లు రికవరీకి రాలేదని సభ్యులు ఆరోపిస్తున్నారు. రుణం మంజూరు చేసిన మరుసటి నెల నుంచే ఆ రుణ వాయిదాలు సభ్యులను చెల్లించాల్సి ఉన్నప్పటికీ.. బ్యాంకర్లు ఇన్నాళ్లూ ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నారు. ‘సదరు గ్రామదీపికతో కుమ్మక్కవడం వల్లనే ఇన్నాళ్లూ బ్యాంకర్లు రుణ వసూలుకు రాలేదా?’ అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, తాము తీసుకోని రుణాన్ని తామెందుకు చెల్లించాలనే కారణంతోనే కూడా మిన్నకుండిపోయామని అంటున్నారు. అయితే, పాండురంగాపురంలో సదరు గ్రామదీపిక సుమారు రూ.2 కోట్లకు పైనే సంఘాల సొమ్మును స్వాహా చేసి ఉడాయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పాండురంగాపురానికి చెందిన సదరు గ్రామదీపిక ఆరు నెలలుగా గ్రామంలో కనిపించడం లేదు. కుటుంబంతో సహా ఉడాయించినట్లు సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, సదరు గ్రామదీపిక ఓ గ్రూపు సభ్యురాలికి బ్యాంకు నుంచి వచ్చిన డబ్బులను అప్పుగా తీసుకొని తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడంతో సదరు మహిళ ఆ గ్రామదీపికపై కోర్టులో కేసు వేసింది. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో ఆ గ్రామదీపికకు కోర్టు జైలు శిక్ష విధించింది. సుమారు నెల రోజులపాటు గ్రామదీపిక జైలులో ఉండి వచ్చింది. ఆ తరువాత నుంచి సదరు గ్రామదీపిక ఊర్లో కనిపించలేదు. కనీసం ఎక్కడ ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. కుటుంబంతో సహా ఇల్లు వదిలి పారిపోవడంతో ఓ పక్క రుణదాతలు, మరోపక్క ఎస్హెచ్జీ సభ్యులు గ్రామదీపిక ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నారు.
నాలుగేళ్ల కిత్రం ఎవరో తెలియని సభ్యులతో సదరు గ్రామదీపిక తప్పుడు గ్రూపు ఏర్పాటు చేయించి రూ.10 లక్షలు రుణం మంజూరు చేయించింది. నాకు మాత్రం రూ.30 వేలు మాత్రమే ఇచ్చింది. ఫేక్ గ్రూపు ఏర్పాటు చేసి రూ.10 లక్షలు మంజూరు చేయించి సొంతానికి వాడుకుంది. మా గ్రూపులోని పదిమంది సభ్యులెవరో కూడా నాకు తెలియదు. రుణ వాయిదా కట్టాలని ఆ గ్రామదీపిక ఏనాడూ నన్ను అడగలేదు. గ్రామదీపిక ఊర్లో లేనప్పుడు బ్యాంకు అధికారులు మా ఇంటికి వచ్చారు. నేను రూ.లక్ష రుణం తీసుకున్నానని, తిరిగి చెల్లించాలని అంటున్నారు.
-ఎర్రబోయిన పద్మ, భరతమాత గ్రూపు సభ్యురాలు, బాధితురాలు
ఐదేళ్ల క్రితం గ్రామదీపిక జయ వచ్చి 10 మందితో మమ్మల్ని గ్రూపుగా ఏర్పాటుచేసింది. రూ.20 లక్షలు రుణం తీసుకొని సొంతానికి వాడుకుంది. ఇప్పుడు బ్యాంకు అధికారులు మా ఇంటికి వచ్చారు. నేను రూ.2 లక్షలు రుణం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఆ రుణాన్ని తిరిగి చెల్లించకపోతే మా ఆస్తి జప్తు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. అసలు నేను రుణమే తీసుకోలేదు. ఇదే మాట బ్యాంకర్లకు చెప్పినా వారు వినిపించుకోవడం లేదు.
-ఆదురి డయానా, బాధితురాలు, పాండురంగాపురం