ఖమ్మం, ఫిబ్రవరి 5 : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన భాషను మార్చుకోవాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు సూచించారు. సీఎం పదవిలో ఉండి కూడా ఆయన తన స్థాయిని మరిచి సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణను తెచ్చిన ఉద్యమ నేత కేసీఆర్ పట్ల రేవంత్రెడ్డి మాట్లాడుతున్న అసభ్య పదజాలాన్ని విని రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. ఇప్పటికైనా రేవంత్రెడ్డి తన భాషను మార్చుకోవాలని హితవుచెప్పారు. అసలు కేసీఆరే లేకపోతే రేవంత్రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యేవారా? ముఖ్యమంత్రి అయ్యేవారా? అని ప్రశ్నించారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖర్రెడ్డి, రేవంత్ గురువు చంద్రబాబు వంటి వారు కూడా ఏనాడూ ఇలాంటి బూతులు మాట్లాడలేదని గుర్తుచేశారు. పాలన మొదలుపెట్టి 60 రోజులైనా హామీలను ఎందుకు అమలు చేయలేయడం లేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ పథకాలనూ అమలుచేయాలని డిమాండ్ చేశారు. రైతుబంధు సాయం ఇంకా ఇవ్వలేదని, వ్యవసాయ విద్యుత్ను 6 గంటలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు లేక రైతుల పంటలు ఎండిపోతున్నాయని, దీంతో కూసుమంచి రైతులు ఆదివారం ధర్నా కూడా చేసి నిరసన తెలిపారని గుర్తుచేశారు.
ఆసరా పింఛన్ల అడ్రస్ లేదని, గ్యాస్ సిలిండర్ల ఊసే లేదని విమర్శించారు. హామీల అమలులో నిర్లక్ష్యంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నాయకులను ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు నిలదీస్తారని అన్నారు. తెలంగాణ గురించి గతంలో ఏ రోజూ మాట్లాడని రేవంత్.. గతంలో ‘జై తెలంగాణ’ అంటూ నినదించిన వారిని తుపాకులతో బెదిరించిన విషయం నిజం కాదా? అని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమని అన్నారు. దేశంలో కర్ణాటక, తెలంగాణ మినహా ఏ రాష్ట్రంలోనూ ఆ పార్టీ అధికారంలో లేదని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు 40 సీట్లు కూడా రావని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే చెబుతున్నారని అన్నారు. కాంగ్రెస్ మంత్రులు కూడా తమ స్థాయిని మరిచి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఉమ్మడి నల్గొండలో ఒక మంత్రి.. అక్కడి జడ్పీ చైర్మన్ను మెడ పట్టుకొని నెట్టారని అన్నారు. ఖమ్మంలో మేయర్ లేకుండానే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. కేఎంసీ అధికారులతో సమీక్షించడం సరికాదని అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేశ్రెడ్డి మాట్లాడుతూ.. పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, బీఆర్ఎస్ నాయకులు జీవన్, డోకుపర్తి సుబ్బారావు, కొల్లు పద్మ, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.