మామిళ్లగూడెం, జనవరి 17: వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో జిల్లాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రతిఒక్కరూ ఓటు హక్కు పొందాలని కలెక్టర్ వీపీ గౌతమ్ విజ్ఞప్తి చేశారు. ఖమ్మంలోని కలెక్టరేట్లో బుధవారం ఓటు హక్కు నమోదుపై రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఏఈఆర్వోలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. 1-11-2020 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఓటు వేసేందుకు అర్హులన్నారు. గ్య్రాడ్యుయేట్లు ఫారం-18 నింపి ఓటు హక్కు పొందాలన్నారు. ఫిబ్రవరి 24న ఓటర్ జాబితా డ్రాఫ్ట్లను ప్రకటిస్తామన్నారు. వీటిపై ఇదే రోజు నుంచి మార్చి 14వ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. మార్చి 29న అభ్యంతరాలను పరిష్కరిస్తామన్నారు. ఏప్రిల్ 4న తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. ప్రస్తుతం గ్రాడ్యుయేట్గా నమోదు అయిన వారూ, కొత్తగా నమోదు అయ్యేవారూ కొత్తగా నమోదు కావాలన్నారు. మాన్యువల్ లేదా వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు.
గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత పత్రంతో పాటు గెజిటెడ్ అధికారితో అటెస్టెడ్ చేయించాలని సూచించారు. దీంతోపాటు పాస్ఫొటో, అసెంబ్లీ నియోజకవర్గ ఎపిక్ కార్డ్ జిరాక్సును జత చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు బి.సత్యప్రసాద్, మధుసూదన్ నాయక్, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, ఖమ్మం, కల్లూరు రెవెన్యూ డివిజన్ అధికారులు గణేశ్, అశోక్చక్రవర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి, జిల్లా పంచాయతీ అధికారి హరికిషన్, జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.వి.అప్పారావు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.మాలతి, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి విద్యాచందన, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు రాంబాబు, మాస్టర్ ట్రైనర్ శైలేందర్, పలువురు తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఎంపీవోలు పాల్గొన్నారు.