సారపాక, సెప్టెంబర్ 22: ముఖ్యమంత్రి కేసీఆర్ను మూడోసారి అధికారంలోకి తెచ్చేందుకు ప్రతిఒక్కరూ సమష్టిగా కృషిచేయాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పిలుపునిచ్చారు. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. మణుగూరులోని ఇల్లెందు గెస్ట్హౌస్లో బీఆర్ఎస్ బూత్ కమిటీ కో ఆర్డినేటర్ల సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని అన్నారు. ప్రతి 100 ఓట్లకు ఒక ఇన్చార్జిని నియమించామని, ఆ ఇన్చార్జి ఆయా ఓటర్లను నిత్యం కలుస్తూ వారి సాదకబాధకాలు తెలుసుకుంటూ సంక్షేమ పథకాలను అందించేందుకు కృషి చేయాలని సూచించారు. నాలుగు బూత్లకు ఒకరి చొప్పున ఉన్న కోఆర్డినేటర్లు.. ఇన్చార్జులను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషిచేయాలని సూచించారు. జడ్పీటీసీ పోశం నర్సింహారావు, ఎన్నికల మండల కో ఆర్డినేటర్లు, బీఆర్ఎస్ నాయకులు కుర్రి నాగేశ్వరరావు, ముత్యం బాబు, అడపా అప్పారావు, వట్టం రాంబాబు, నూకారపు రమేశ్, యాదగిరిగౌడ్, ఎడ్ల శ్రీనివాస్, బొలిశెట్టి నవీన్, పఠాన్ యూసఫ్ పాల్గొన్నారు.