సారపాక, ఆగస్టు 23 :ఆడపిల్లలపై వివక్ష ఈనాటిది కాదు.. తల్లిదండ్రులే భారంగా భావించేవారు.. మగపిల్లవాడే తమను ఉద్ధరిస్తాడనే గుడ్డి నమ్మకంతో ఉండేవారు.. ఆడపిల్లలను కర్కశంగా పురిట్లోనే చంపేసిన ఘటనలు కోకొల్లలు. సాదలేక అమ్ముకున్న తల్లిదండ్రులూ లేకపోలేదు. ఈ దుస్థితిని మార్చేందుకు నాటినుంచి ప్రభుత్వాలు ప్రజలను ఎంతో చైతన్యం చేస్తున్నప్పటికీ మార్పు స్వల్పమే. ఇందుకు కారణం వారి బతుకుకు భరోసానివ్వకపోవడమే. కానీ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ ఆడబిడ్డకు రక్షణ కోటగా నిలిచారు. వారి సంక్షేమం కోసం అనేక పథకాలు అమలుచేస్తూ కొండంత అండగా ఉంటూ ధైర్యమై.. ఆత్మైస్థెర్యమై నిలబడ్డారు. అన్ని విషయాల్లో తోడుగా ఉంటూ భరోసానిచ్చారు. దీంతో నాటి పరిస్థితులు సమూలంగా మారాయి. ఆడపిల్లల తల్లిదండ్రుల్లో మంచి మార్పు కనిపిస్తున్నది. నాడు భారమనుకున్న ఆడపిల్ల నేడు వరమై.. కన్నవారి కనుపాపై.. ఇంటి మహాలక్ష్మిగా వెలుగొందుతున్నది.
ఉమ్మడి రాష్ట్ర పాలకుల హయాంలో ఆడపిల్ల వివక్షకు గురైంది. సమాజంలో ఆమెను చిన్నచూపుతో చూస్తూ భారంగా భావించి పురిట్లోనే చిదిమేసే పరిస్థితులు ఉండేవి. కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆడపిల్లల భవిష్యత్కు భరోసానిచ్చింది. వారి సంక్షేమానికి పలు పథకాలు అమలు చేస్తుండడంతో వివక్ష క్రమంగా తొలగిపోయింది. దీంతో నేడు ఆడపిల్లను ఇంటి మహాలక్ష్మిగా భావిస్తున్నారు.. తమకు ఆడపిల్లే కావాలని మరీ కోరుకుంటున్నారు.
నాడు భారం.. నేడు వరం
గత పాలకులు ఆడపిల్లల భవిష్యత్ కోసం ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టకపోవడంతో గిరిజన ప్రాంతాలు, తండాల్లో పేద, బడుగు, బలహీనవర్గాల వారు, గిరిజనులు ఆడపిల్లలు పుడితే భారంగా భావించే పరిస్థితి ఉండేది. వారిని సాదలేక కళ్లు తెరవకముందే ఇతరులకు అమ్ముకున్న దీనస్థితి మనకు తెలిసిందే. ఉమ్మడి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. అలాంటి పరిస్థితుల నుంచి ఆడపిల్లే మా ఇంటి మహాలక్ష్మి… ఇంటికొక ఆడపిల్ల ఉంటే ఆ ఇంట్లో సందడి అనే రోజు వచ్చేలా చేసింది తెలంగాణ ప్రభుత్వం. కూడు, గూడు, గుడ్డకు కరువై ఆడపిల్లను సాకే పరిస్థితే లేనప్పుడు ఇక లక్షల కట్నం ఇచ్చి వివాహాలెలా చేస్తామంటూ వారిని అమ్మేద్దామనే తల్లిదండ్రుల ఆలోచనను దూరంచేసింది. ఆడపిల్లను బతికించేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నది.
పెరుగుతున్న ఆడపిల్లల సంఖ్య
తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డల సంక్షేమానికి ప్రవేశపెడుతున్న పథకాలతోపాటు ఆడపిల్లలపై వివక్షను రూపుమాపేలా అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. దీంతో తల్లిదండ్రుల్లో చైతన్యం రావడంతో ఆడపిల్లలను పురిట్లోనే చంపే ఘటనలు పూర్తిగా తగ్గిపోయాయి. ఆడపిల్ల అయితేనేం మగాడిలా పెంచుకుందామనే ఆలోచనతో ముందుకెళుతున్నారు. గతంలో మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టగానే రెండో కాన్పుకు ఒకటికి పదిసార్లు స్కానింగ్లు తీయించి ఆడపిల్ల అని తెలియగానే కడుపులోనే చంపేసేవారు. ప్రస్తుతం అలాంటి చర్యలేమీ తీసుకోకుండా ఇద్దరు ఆడపిల్లలైనా ఏం పర్వాలేదనే స్థితికి వచ్చారు. 2012-13లో రాష్ట్రంలో ప్రతి 1000 మంది మగపిల్లలకు 925 మంది ఆడపిల్లలు ఉండగా.. 2016-17కు వచ్చేసరికి 959 మగపిల్లలు ఉంటే 1000 మంది ఆడపిల్లలు ఉన్నారని కాగ్ నివేదికలు అప్పట్లోనే తేల్చిచెప్పాయి. అంటే ఆడపిల్లలను ప్రభుత్వ పథకాలు బతికిస్తున్నాయనేది స్పష్టమవుతోంది.
పుట్టింటి భారం పూడ్చగా…
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నాటినుంచి ఆడపిల్లల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెడుతూ వారి తల్లిదండ్రుల్లో ఆత్మైస్థెర్యాన్ని పెంచుతున్నారు. ఆడబిడ్డ గర్భం దాలిస్తే మొదటి కాన్పు తల్లిదండ్రులు చేయించడం ఆనవాయితీ. దీంతో పేద తల్లిదండ్రులపై ఆర్థికభారం పడొద్దని సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానలను ఆధునీకరించారు.. ప్రత్యేకంగా ప్రసూతి విభాగంలో అన్నిరకాల సామగ్రి, వసతులు కల్పించి కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు అందిస్తున్నారు. అంతేకాదు ఇక్కడ ప్రసవించిన తల్లికి రూ.13 వేలతోపాటు కేసీఆర్ కిట్ను అందజేస్తున్నారు. గర్భిణులు ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలంటే గతంలో ఆటోలు, బస్సుల ద్వారా వెళ్లాల్సి వచ్చేది. కానీ సీఎం కేసీఆర్ అమ్మఒడి వాహనం ద్వారా వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లి అన్ని పరీక్షలు నిర్వహించి తిరిగి ఇంటివద్ద దిగబెడుతున్నారు. ప్రసవానికి, ప్రసవం అనంతరం కూడా అమ్మఒడి వాహనంలో ఉచితంగా ఇంటికి చేరుస్తూ వారి ఇబ్బందులు తొలిగించారు. సంక్షేమ పథకాలతో ప్రభుత్వం నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపుతుందనడంలో అతిశయోక్తిలేదు.
సుకన్య సమృద్ధి పథకం
బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా బాలికల సమగ్రాభివృద్ధి కో సం రాష్ట్రప్రభుత్వం కేంద్రం సహకారంతో సుకన్య సమృద్ధి యోజనను అమలుచేస్తున్నది. ఈ పథకంలో భాగంగా 10 సంవత్సరాల లోపు బాలికలు పోస్టాఫీసు, బ్యాంకుల్లో ఖాతా తెరవాల్సి ఉంటుంది. ఒక సంవత్సరానికి కనీస డిపాజిట్ రూ.1000 నుంచి రూ.1,50,000 వరకు జమచేస్తే అధిక చక్రవడ్డీ 9.1 శాతం లభిస్తుంది. అకౌంట్ తెరిచిన 14 సంవత్సరాల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. 21 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ నగదు చెల్లిస్తారు. బాలికల ఉన్నత చదువు, వివాహాన్ని దృష్టిలో పెట్టుకుని బాలికల వయస్సు, 18 సంవత్సరాలు నిండిన తరువాత 50శాతం నగదు విత్డ్రా చేసుకునే సదుపాయం ఉంది. మెచ్యురిటీ తేదీ 21 సంవత్సరాలు నిండిన తర్వాత ఆ ఖాతాలో సొమ్మును తిరిగి చెల్లిస్తారు. ఉదాహరణకు నెలకు రూ.1000 చొప్పున డిపాజిట్ చేస్తే 14 ఏళ్లకు చక్రవడ్డీ 9.1 శాతం కలుపుకుని రూ.3,39,874 అవుతాయి. బాలికకు 21ఏళ్లకు ఆ డబ్బు రూ.6,25,305 అందుతాయి. గరిష్ఠంగా ఇద్దరు ఆడపిల్లలకు మాత్రమే ఈ ఖాతాను తెరిచే అవకాశం ఉంది.
తల్లిదండ్రులకు అండగా కల్యాణలక్ష్మి
ఆడబిడ్డకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ రాష్ట్రంలో లేనివిధంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారు. 2015 నవంబర్లో రూ.51 వేల సాయంతో ప్రారంభించిన ఈ పథకాన్ని 2018 ఏప్రిల్లో రూ.75 వేలకు పెంచారు. సరిగ్గా ఏడాది తిరగకముందే మరోమారు సాయం మొత్తాన్ని పెంచి రూ.1,00,116 చేశారు. ఏప్రిల్ నుంచి ఆడబిడ్డల వివాహానికి ప్రభుత్వం రూ.లక్షా నూటపదహార్లు అందిస్తున్నది. దీంతో ఆడబిడ్డల పెళ్లి ఖర్చులు ప్రభుత్వమే భరించినైట్లెంది. ఆడబిడ్డల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నా బిడ్డలంటే నాకు ప్రాణం
నాకు ఇద్దరు కుమార్తెలు. నా బిడ్డలంటే నాకు ప్రాణం. గతంలో కడుపులోనే ఆడపిల్లలను చంపుతున్న దుస్థితి చూసి చలించిపోయా. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఆడబిడ్డకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి వారి వివాహానికి ఆర్థికసాయం కూడా అందిస్తున్నది. నిరుపేద కుటుంబాలను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ నిజంగా దేవుడు. ప్రభుత్వ పథకాలు చాలా బాగున్నాయి.
– శ్రీరామ నాగశ్రీనివాసరావు, సారపాక
ప్రభుత్వ పథకాలు ఆడబిడ్డలకు వరం
ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆడబిడ్డలకు వరంగా మారాయి. మా అమ్మకు ఇద్దరం ఆడపిల్లలం. నా వివాహానికి కల్యాణలక్ష్మి సాయం అందింది. ఇప్పుడు నాకు ఆడబిడ్డ. మా ఇంటి మహాలక్ష్మి పుట్టింది. ప్రభుత్వ పథకాలు ఆడపిల్లలకు భరోసా కల్పిస్తున్నాయి. నేడు ఆడ, మగ అనే భావన తల్లిదండ్రుల్లో తొలిగిపోవడం చాలా సంతోషంగా ఉంది.
– కంది స్వప్నారెడ్డి, సారపాక