తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర అందించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలతో అండగా నిలిచిన ప్రభుత్వం.. తాజాగా మక్కల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రైవేట్ వ్యాపారులు మక్కల ధరలను తగ్గించి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతుండగా.. పరిస్థితిని గమనించిన సీఎం కేసీఆర్ క్వింటాకు రూ.1,962 మద్దతు ధర ఇచ్చి రైతుల నుంచి మార్క్ఫెడ్ ద్వారా మక్కలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లా వ్యవసాయ, మార్కెటింగ్శాఖ, మార్క్ఫెడ్ మక్కల సేకరణకు రంగం సిద్ధం చేస్తున్నాయి. సేకరించిన మక్కలను గోడౌన్లకు తరలించేందుకు లారీ యజమానుల నుంచి టెండర్లు స్వీకరిస్తున్నారు. రెండురోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి కానున్నది. ఖమ్మం జిల్లాలో 91,225 ఎకరాలు, భద్రాద్రి జిల్లాలో 28,496 ఎకరాల్లో రైతులు మక్క సాగు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 31 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. వీటి నిర్వహణ బాధ్యతలను సొసైటీలు తీసుకోనున్నాయి.
ఖమ్మం, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ భద్రాద్రి కొత్తగూడెం, (నమస్తే తెలంగాణ): యాసంగిలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతులు మక్కలు సాగు చేశారు. పంట చేతికి వస్తున్న తరుణంలో అకాల వర్షం నీళ్ల పాలు చేసింది. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ వ్యాపారులు ఒక్కసారిగా మక్కల ధరలను తగ్గించేందుకు సిద్ధమవుతున్న క్రమంలో రైతులు ఆందోళనకు గురయ్యారు. పరిస్థితులను గమనించిన సీఎం కేసీఆర్ క్వింటాకు రూ.1962 మద్దతు ధర ఇచ్చి రైతుల నుంచి మార్క్ఫెడ్ ద్వారా మక్కలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యవసాయ, మార్కెటింగ్శాఖ, మార్క్ఫెడ్ మక్కల సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మక్కల సేకరణపై పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించారు. సేకరించిన మక్కలను గోడౌన్లకు తరలించేందుకు గాను ప్రస్తుతం లారీ యజమానుల నుంచి టెండర్లు స్వీకరిస్తున్నారు. రెండు రోజుల్లో టెండర్ల ప్రకియ పూర్తి కానున్నది.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 31 కేంద్రాలు..
ఖమ్మం జిల్లావ్యాప్తంగా 91,225 ఎకరాలు, భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 28,496 ఎకరాల్లో రైతులు మక్కల సాగు చేపట్టారు. వాతావరణం అనుకూలించడం, సాగునీరు పుష్కలంగా ఉండడంతో పంట ఆశాజనకంగా ఉంది. అకాల వర్షాలతో కొంత పంట దెబ్బతిన్నప్పటికీ మిగిలిన పంటను సర్కార్ మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయనున్నది. మక్కల కొనుగోలుకు ఖమ్మం జిల్లాలో 21, భద్రాద్రి జిల్లాలో 10 కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. కేంద్రాల నిర్వహణ, కొనుగోలు బాధ్యతలను డీసీఎంఎస్, సొసైటీలు తీసుకోనున్నాయి.
గోడౌన్లు, ట్రాన్స్పోర్ట్పై ప్రత్యేక దృష్టి..
గత అనుభవాలు, లోటుపాట్లను దృష్టిలో పెట్టుకుని మార్క్ఫెడ్ మక్కల కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నది. మక్కల రవాణాకు ఇప్పటికే ఉభయ జిల్లాలకు చెందిన లారీ యజమానుల నుంచి టెండర్లు ఆహ్వానించింది. ఖమ్మం జిల్లాలో టెండర్ల ప్రక్రియ చివరి దశకు వచ్చింది. ఒకటి రెండు రోజుల్లో భద్రాద్రి జిల్లాలోనూ పూర్తి కానున్నది. మరోవైపు మక్కల నిల్వకు గోడౌన్ల వినియోగానికి రాష్ట్ర స్టేట్ వే హౌసింగ్ సంస్థ నుంచి అనుమతులు వచ్చాయి. ఈసారి మార్క్ఫెడ్ సుమారు 60 వేల మెట్రిక్ టన్నుల మక్కలు సేకరించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. భద్రాద్రి జిల్లాలో 14 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్లు, ఖమ్మం జిల్లాలో 20 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల గోడౌన్లను మార్క్ఫెడ్ తన ఆధీనంలోకి తీసుకుంటున్నది. అంతేగాక అవసరాన్ని బట్టి సూర్యాపేట జిల్లాలో మరో 40 వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న గోడౌన్లను తీసుకోనున్నది. మే మొదటి వారంలో మక్కల కొనుగోళ్లు ప్రారంభంకానున్నాయి.
పారదర్శకతకు ప్రత్యేక సాఫ్ట్వేర్..
మక్కల పంటల కొనుగోళ్లలో అవకతవకలకు తావు లేకుండా మార్క్ఫెడ్ ప్రత్యేక సాఫ్ట్వేర్ను తీసుకువస్తున్నది. అందుకు గాను ఇప్పటికే వ్యవసాయశాఖ ప్రత్యేక వెబ్సైట్లో ఏఈవోలు తమ పరిధిలో సాగైన మక్క పంటల వివరాలను పోర్టల్లో నమోదు చేశారు. ఈ మార్క్ఫెడ్కు అనుసంధానమై ఉంటాయి. దీంతో కొనుగోలు కేంద్రాలకు పంట తీసుకొచ్చిన వ్యక్తి రైతా? లేదా దళారీనా? అన్న విషయం ఇట్టే తెలిసిపోతుంది. కేంద్రాల్లో మక్కలు విక్రయించేందుకు వచ్చే రైతులు తమ వెంట పట్టాదారు పాస్పుస్తకం, బ్యాంక్ ఖాతా పుస్తకం, ఆధార్కార్డ్ జిరాక్స్లను తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ వివరాలు తీసుకున్న తర్వాత కేంద్రాల నిర్వాహకులు, సిబ్బంది రైతులకు టోకెన్లు అందజేస్తారన్నారు. రైతుల నుంచి మక్కలు సేకరించిన కొద్దిరోజుల్లోనే మార్క్ఫెడ్ వారి ఖాతాల్లో సొమ్ము జమచేయనున్నది.
రైతులకు అండగా సర్కార్
మార్చి నెలాఖరులో వచ్చిన అకాల వర్షం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వందలాది మంది సాగు చేస్తున్న పంటలను దెబ్బతీసింది. ఆయా పంటల్లో మక్క పంటే ఎక్కువగా నేలవాలింది. ఆరుగాలం శ్రమించి సాగు చేస్తున్న రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ స్వయంగా క్షేత్రస్థాయికి వచ్చి పంటలను పరిశీలించారు. ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. మాట ఇచ్చిన విధంగానే ఆ మేరకు నిధులు విడుదల చేశారు. దీంతో బాధితులు నష్టాల నుంచి ఊరట చెందారు. ఆ తర్వాత కొన్ని రోజులకు అకాల వర్షం మళ్లీ వచ్చింది. పంటలను దెబ్బతీసింది. ఈసారి కూడా మక్క పంటే ఎక్కువగా నేలవాలింది. పంటల నష్టంపై ఇప్పటికే వ్యవసాయశాఖ అధికారులు నివేదిక రూపొందించారు. నష్ట తీవ్రత ఇల్లెందు డివిజన్లో ఎక్కువగా కనిపించింది. రెండోసారి కురిసిన అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులకూ త్వరలో సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
పక్కాగా మక్కల సేకరణ..
వ్యవసాయశాఖ అధికారులు అందించిన మక్కల సాగు వివరాల ప్రకారం పంటను కొనుగోలు చేస్తాం. ప్రభుత్వ నిబంధనలను పక్కాగా అమలు చేస్తాం. మే మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. దళారుల మాటలు నమ్మి మోసపోకుండా రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే మక్కలు అమ్మాలి. ఇప్పటికే కేంద్రాల్లో వేయింగ్ మిషన్లు, టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాం.
– ఎం.సునీత, మార్క్ఫెడ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా మేనేజర్
నిబంధనల ప్రకారం కొనుగోళ్లు..
భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 10 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. కలెక్టర్ అనుదీప్ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెటింగ్శాఖ కార్యాలయంలోనూ ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. అకాల వర్షం కారణంగా పంట నష్టపోయిన వారు ఆందోళన చెందొద్దు. పంట నష్టం అంచనా వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. బాధితులకు సాయం అందేలా చూస్తాం.
– కొర్సా అభిమన్యుడు, డీఏవో, కొత్తగూడెం