ఉమ్మడి రాష్ట్రంలో ఛిద్రమైన కుల వృత్తులకు తెలంగాణ ప్రభుత్వం జీవం పోస్తున్నది. సబ్బండ వర్గాలకు వివిధ పథకాలతో ఉపాధికి బాటలు వేస్తున్నది. ఉన్నచోట పని కల్పించడంతో వలసెళ్లిన వారందరూ తిరిగి పల్లెబాట పడుతున్నారు. గొల్లకురు మలకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం రాయితీపై గొర్రెలను పంపిణీ చేస్తున్నది. ఇప్పటికే మొదటి విడత గొర్రెల పంపిణీ ప్రక్రియను పూర్తి చేసిన సర్కార్.. లబ్ధిదా రులకు రెండో విడత గొర్రెలు అందజేసేందుకు కసరత్తు చేస్తున్నది. తొలి విడతలో ఒక్కో యూనిట్ విలువను రూ.1.25 లక్షలుగా నిర్ణయించింది. ఇందులో రూ 93,750ను సబ్సిడీగా అందించింది. రెండో విడతలో మరో రూ.50 వేల రాయితీని పెంచి యూనిట్ విలువను రూ.1.75 లక్షలుగా ప్రకటించింది. ఇందులో లబ్ధిదారులు తమ వాటాధనం 25 శాతం కింద రూ.43,750ని డీడీలు తీయాలి. 18 ఏళ్లు నిండిన యాదవ, కురుమలకు సొసైటీ సభ్యత్వం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో సొసైటీల సంఖ్య 90 నుంచి 330కి పెరిగింది. వీటిల్లో పాత, కొత్త సభ్యులు కలిపి సుమారు 31,773 మంది ఉన్నారు.
ఖమ్మం వ్యవసాయం, జూలై 28: రెండో విడతకు ఎంపిక చేసిన పెంపకందారులకు మరికొద్ది రోజుల్లోనే రాయితీ గొర్రెల పంపిణీ ప్రారంభం కానున్నది. రెండు రోజుల క్రితం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మలి విడత గొర్రెల పంపిణీకి సంబంధించి జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీంతో ఆయా మండలాల పశుసంవర్ధక శాఖ అధికారులు గురువారం పెంపకందారులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మలి విడతకు ఎంపికైన లబ్ధిదారులతో మాట్లాడారు. పది రోజుల్లో లబ్ధిదారులు తమ వాటా ధనంతో డీడీలు తీసి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన రాయితీ గొర్రెల పథకంతో పల్లెలో ఎక్కడ చూసినా గొర్రెల గుంపులు దర్శనమిస్తున్నాయి. గొర్రెలను రాయితీపై అందించడంతోపాటు రవాణా, బీమా సౌకర్యాలను ప్రభుత్వ కల్పిస్తోంది. గడ్డి గింజలను కూడా 75 శాతం రాయితీతో అందిస్తోంది. లబ్ధిదారులను అధికారులు ఇప్పటికే లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 31 వేల మంది లబ్ధిదారులు కాగా.. తొలి విడతలో 15 వేల మందికి, మలి విడతలో మరో 16 వేల మందికి గొర్రెలు అందనున్నాయి. ఒక్కో యూనిట్లో 20 గొర్రెలు, ఒక గొర్రె పోతు ఉంటాయి.
మలి విడతలో అదనపు రాయితీ..
ప్రస్తుతం మార్కెట్లో జీవాలకు పెరిగిన ధరల దృష్ట్యా ప్రభుత్వం గొర్రెల యూనిట్ ధర విలువను పెంచింది. తొలి విడతలో ఒక్కో యూనిట్ విలువను రూ.1.25 లక్షలుగా నిర్ణయించింది. ఇందులో రూ 93.750ను సబ్సిడీగా అందించింది. రెండో విడతలో మరో రూ.50 వేల రాయితీని పెంచి యూనిట్ విలువను రూ.1.75 లక్షలుగా ప్రకటించింది. ఇందులో లబ్ధిదారులు తమ వాటాధనం 25 శాతం కింద రూ.43,750ని డీడీలు తీయాలి. 18 ఏళ్లు నిండిన యాదవ, కురుమలకు సొసైటీ సభ్యత్వం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో సొసైటీల సంఖ్య 90 నుంచి 330కి పెరిగింది. వీటిల్లో పాత, కొత్త సభ్యులు కలిపి సుమారు 31,773 మంది ఉన్నారు.
పారదర్శకత కోసం ప్రత్యేక యాప్..
గొర్రెల కొనుగోలు, పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్ను రూపొందించింది. ఇక నుంచి కొనుగోలు చేసిన గొర్రెల సంఖ్యను ఈ యాప్లో నమోదు చేయడంతోపాటు లోకేషన్ ఫొటో, గొర్రెల ఫొటోలను ఇందులో నిక్షిప్తం చేస్తారు. కొనుగోలు సమయంలో గొర్రెలను వాహనంలో ఎక్కించే ఫొటోలు మొదలుకొని లబ్ధిదారుడికి ఇంటికి చేర్చే వరకూ అన్ని వివరాలు, ఫొటోలు ఈ యాప్లో ఉంటాయి. లైవ్ వివరాలు, ఫొటోలను మాత్రమే యాప్ స్వీకరిస్తుంది.
మండలాల వారీగా యూనిట్లు..
మలి విడతలో 16,189 మందికి గొర్రెలను పంపిణీ చేయనున్నారు. మండలాల వారీగా కేటాయించిన యూనిట్ల వివరాలు ఇలా ఉన్నాయి. రఘునాథపాలేనికి 512 యూనిట్లు, ముదిగొండకు 818, చింతకానికి 1,027, బోనకల్లుకు 905, మధిరకు 795, ఎర్రుపాలేనికి 579, తిరుమలాయపాలేనికి 914, ఖమ్మం రూరల్కు 1,111, కూసుమంచికి 1,275, నేలకొండపల్లికి 1,047, తల్లాడకు 392, కల్లూరుకు 676, సత్తుపల్లికి 468, వేంసూరుకు 794, పెనుబల్లికి 1,296, సింగరేణికి 675, కొణిజర్లకు 924, వైరాకు 727, ఏన్కూరుకు 366, కామేపల్లికి 558 చొప్పున యూనిట్లు కేటాయించారు. వీటితోపాటు తొలివిడతకు సంబంధించి ఇప్పటికే డీడీలు తీసిన మరో 450 మందికి కూడా యూనిట్లు పంపిణీ చేయనున్నారు.
రెండు వారాల్లోగా డీడీలు సమర్పించాలి
రెండో విడతకు ఎంపికైన లబ్ధిదారులు రెండు వారాల్లోపు బ్యాంకుల ద్వారా తమ వాటా ధనం డీడీలు తీసి ఆయా మండలాల్లోని పశువైద్య అధికారులకు అందజేయాలి. ప్రభుత్వ సూచనల మేరకు తదుపరి చర్యలు చేపడతాం. యూనిట్ల పంపిణీకి సంబంధించిన తేదీల వివరాలు ఒకటి రెండు రోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉంది.
– డాక్టర్ వేణుమనోహర్, జేడీ, జిల్లా పశుసంవర్థకశాఖ