కరకగూడెం, అక్టోబర్ 5 : ఏజెన్సీ గిరిజన గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. గురువారం మండలంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కొత్తగూడెం నుంచి కోరంవారిగుంపు మధ్యలో గల ఒర్రెపై రూ. 25లక్షల వ్యయంతో వంతెన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతారం పంచాయతీలోని అల్లేరుగూడెం నుండిచి బర్లగూడెం వరకు బీటీ రహదారి నిర్మాణానికి రూ. 2.26 కోట్లతో చేపట్టిన పనులకు భూమి పూజ చేశారు.
భట్టుపల్లి పంచాయతీ లక్ష్మీపురంలో ఆర్అండ్బీ రహదారి నుంచి వడ్డేరుగుంపు, బురదారం రహదారి వరకు రూ.2.50 కోట్లతో నిర్మాణం చేపట్టనున్న రహదారికి శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఏజేన్సీ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. నియోజకవర్గానికి వేలకోట్ల నిధులు కేటాయించి గ్రామాల రూపురేఖలు మారుస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అర్హులందరికీ అందజేస్తున్నట్లు తెలిపారు.
దళితబంధు, బీసీబంధు, మైనార్టీ వంటి పథకాలతో పేదల కుటుంబాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వెలుగులు నింపుతుందని పేర్కొన్నారు. అన్నివర్గాల శ్రేయస్సుకు పాటు పడే సీఎం కేసీఆర్ను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళీక, ఎంపీటీసీ మునీంద్ర, సర్పంచ్ ఇర్ప విజయ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, పంచాయతీ రాజ్ డీఈ సైదుల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.