సారపాక, నవంబర్ 10 : మారుమూలన ఉన్న నియోజకవర్గం ఉమ్మడి రాష్ట్రంలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు, గిరిజనులు, ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే తడవుగా సీఎం కేసీఆర్ పాలనలో నియోజకవర్గ రూపురేఖలు మారిపోయాయి. 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అశ్వాపురం మండలంలో పురుడు పోసుకున్న సీతారామ ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరాయి. మరోపక్క మణుగూరులో రూ.35 కోట్లతో 100 పడకల ఆస్పత్రి, అద్దంలా మెరిసే రోడ్లతోపాటు వెలుగులు విరజిమ్ముతున్న బీటీపీఎస్, రూ.వందల కోట వ్యయంతో రహదారులు, బ్రిడ్జిలు నిర్మించి అభివృద్ధిని కళ్లముందు నిలిపింది. సీఎం కేసీఆర్ సారథ్యంలో నియోజకవర్గం అభివృద్ధిలో అగ్రభాగాన నిలిచింది.
సీఎం కేసీఆర్ గిరిజనులకు పట్టాలు పంపిణీ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. నియోజకవర్గవ్యాప్తంగా 15,962 మందికి 56851.65 ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేశారు. పోడు పట్టాల సమస్యను ఎమ్మెల్యే రేగా కాంతారావు.. సీఎం కేసీఆర్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్ల్లి జిల్లావ్యాప్తంగా పోడు రైతులకు పట్టాలు అందించేలా విశేష కృషి చేశారు.
సీతారామ ప్రాజెక్టు పూర్తయితే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలోని 6,74,387 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ పనులు దాదాపు చివరి దశకు చేరాయి. సీతమ్మసాగర్ బరాజ్ సమీపంలోని మిట్టగూడెం మీదుగా వెళ్లే పాములపల్లి బీటీ రోడ్డు పనులు రూ.7.50 కోట్ల వ్యయంతో పూర్తయ్యాయి. అలాగే బీజీ కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్టు కెనాల్కు అనుసంధానంగా మారెళ్లపాడు వరకు రూ.300 కోట్ల అంచనాతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఇటీవలే ప్రారంభించారు. తొలివిడతగా రూ.25 కోట్లు విడుదల చేయడంతో పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ఏడాదిలోనే మారెళ్లపాడు లిఫ్ట్ పూర్తయి 18 వేల ఎకరాల ఆయకట్టుతోపాటు మండలంలోని అన్ని చెరువులు, కుంటలకు సాగునీరు అందనున్నది. రూ.5 వేల కోట్ల అంచనాతో దుమ్ముగూడెం ఆనకట్టకు దిగువన 200 మీటర్ల దూరంలో 60 మీటర్ల ఎత్తుతో బహుళార్దక సాధక ప్రాజెక్టుగా ఉన్న సీతమ్మ సాగర్ బ్యారేజీ పనులు కొనసాగుతున్నాయి. మరో ఏడాదిలో పూర్తయితే 320 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం అందుతుంది. నీటినిల్వ సామర్థ్యం 36.576 టీఎంసీలు ఉంటుంది. సీతారామ ప్రాజెక్టులో పంపుహౌస్ 1, 2, 3, 4 నిర్మాణాలు చేపట్టగా.. మూడు పూర్తయి మరో పంపుహౌస్ నిర్మాణం పూర్తి చేసుకోనున్నది.
సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించగా.. మున్సిపాలిటీ అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. మున్సిపాలిటీలో రోగుల సౌకర్యార్థం 100 పడకల ఆస్పత్రి నిర్మించి నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నారు. రూ.1.50 కోట్లతో వైకుంఠధామం నిర్మించారు. పట్టణంలో సెంట్రల్ లైటింగ్, విద్యార్థులు, రూ.కోటి వ్యయంతో లైబ్రరీని నిర్మించి ప్రారంభించారు. అలాగే శివలింగాపురం వద్ద రూ.కోటి వ్యయంతో మినీ ట్యాంక్బండ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాల అభివృద్ధికి రూ.2.50 కోట్ల సీఎస్ఆర్ నిధులు మంజూరు చేశారు. మణుగూరులో రూ.50 లక్షలతో నూతన భవనం నిర్మించి ఆర్టీవో సేవలు అందుబాటులోకి తెచ్చారు. పట్టణంలో డీఎంఎఫ్టీ నిధులు రూ.3.80 కోట్లతో సైడ్ డ్రైన్లు, బీటీ, ఆర్అండ్బీ రోడ్లు ఏర్పాటు చేశారు. బస్టాండ్ నిర్మాణానికి రూ.5 కోట్లు, మెగా పల్లె ప్రకృతి వనానికి రూ.2 కోట్లు, రథంగుట్ట అర్బన్ పార్కు అభివృద్ధికి రూ.2 కోట్లు, వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ నిర్మాణానికి రూ.5 కోట్లు, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు రూ.38 కోట్లు.. ఇలా నిధులు తీసుకొచ్చి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు.
మణుగూరు కేంద్రంలో బీటీపీఎస్(భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్), సింగరేణి వెలుగులు విరజిమ్ముతోంది. 2015, మార్చి 28న సీఎం కేసీఆర్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1,080 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో నాలుగు యూనిట్ల ద్వారా నిరంతరం విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. మణుగూరు నుంచి బీటీపీఎస్ వరకు బొగ్గు రవాణా కోసం 9 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ ఏర్పాటు చేశారు. బీటీపీఎస్ సంస్థ పరిసర గ్రామాల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.16 కోట్లను విద్యుత్, తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనకు మంజూరు చేసింది. 353 మంది నిర్వాసితులకు పర్మినెంట్ ఉద్యోగాలు కల్పించింది. అలాగే సింగరేణి మణుగూరు ఏరియాలో మణుగూరు ఓసీ-1, 2, 4, అండర్ గ్రౌండ్ మైన్ కొండాపూర్ ఓసీల్లో బొగ్గు ఉత్పత్తి నిరంతరం జరుగుతోంది. మణుగూరు ఏరియాలో సుమారు 2,400 మంది ఉద్యోగులు పని చేస్తుండగా.. పరోక్షంగా వేలాది మంది కాంట్రాక్టు కార్మికులు లబ్ధి పొందుతున్నారు.
నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులు చేశారు. బత్తులపల్లి టు మర్కోడుకు సుమారు రూ.100 కోట్లతో రోడ్లను పూర్తిస్థాయిలో నిర్మించారు. అలాగే మండలంలో రూ.20 కోట్లతో రహదారుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. గుండాలలో ఎనిమిదేళ్ల కాలంలో అభివృద్ధి పరుగులు పెట్టింది. 2015లో రూ.90 కోట్లతో గుండాల-ఇల్లెందు వరకు 56 కిలోమీటర్ల మేర బీటీ రహదారి నిర్మించారు. కిన్నెరసాని, ఏడుమొలకలవాగు, దున్నపోతులవాగు, పాలవాగులు ఉండగా.. మల్లన్నవాగుకు 2021లో రూ.3.61 కోట్లతో హైలెవల్ బ్రిడ్జి పూర్తి చేశారు. కిన్నెరసాని వాగు సాయిన్నపల్లి దగ్గర ఏడుమలకలవాగు వద్ద బ్రిడ్జిని రూ.2.41 కోట్లతో నిర్మించగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రూ.8కోట్లతో కిన్నెరసాని దొంగతోగు వాగు వద్ద బ్రిడ్జి నిర్మాణానికి తాజాగా విప్ రేగా శంకుస్థాపన చేయడంతో పనులు జరుగుతున్నాయి. రూ.4.84 కోట్లతో రామాంజిగూడెం పంచాయతీలో 5 గ్రామాలకు వెళ్లే జల్లేరు వాగుపై బ్రిడ్జి ఏర్పాటు చేశారు. ఆర్అండ్బీ రోడ్డు నుంచి తునికిబండల వయా తీగలంచ, ఇప్పనపల్లి వరకు రహదారి, రూ.4.84 కోట్లతో హైలెవల్ వంతెన, రహదారి నిర్మాణం చేపట్టారు. రూ.4.43 కోట్లతో ఆర్అండ్బీ రోడ్డు పాతూరు నుంచి రాయిలంక వయా రామాంజిగూడెం వరకు రహదారి, హైలెవత్ వంతెన పూర్తి చేశారు. రూ.3.81 లక్షలతో ఆర్అండ్బీ మర్కోడు రోడ్డు నుంచి పెద్దూరు, సందిబందం, చీమలగుంపు వరకు రహదారి, హైలెవల్ వంతెన పూర్తయింది. రూ.8.10 కోట్లతో ఆర్అండ్బీ సుద్దరేవు రోడ్డు నుంచి నడిమిగూడెం, లొద్దిగూడెం, జాకారం వరకు రహదారి, హైలెవల్ వంతెన పూర్తయి అందుబాటులోకి వచ్చాయి.
సీఎం కేసీఆర్ సహకారం, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో రూ.వందల కోట్ల నిధులు తీసుకొచ్చి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశాం. సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు సీతారామ.. నా నియోజకవర్గం నుంచే ప్రారంభం కావడం నా అదృష్టం. 15,962 మంది పోడు రైతులకు పట్టాలు అందించి వారి కళ్లల్లో వెలుగులు చూశా. సీఎం కేసీఆర్ మరోమారు అధికారంలోకి రావడం ఖాయం. మిగిలిన పనులను కొత్త ప్రభుత్వంలో పూర్తి చేస్తాం.
ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం అశ్వాపురం మండలంలోని రథంగుట్ట వద్ద మిషన్ భగీరథ పథకాన్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా సుమారు రూ.503 కోట్లతో నియోజకవర్గంలోని మణుగూరు, పినపాక, కరకగూడెం, అశ్వాపురం, ఆళ్లపల్లి, గుండాల, బూర్గంపహాడ్ మండలాల్లోని అన్ని గ్రామాల్లోని ఆవాసాలకు ప్రతిరోజూ మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతోంది. 346 గ్రామాల్లో 2,15,117 మందికి శుద్ధి చేసిన నీటిని అందిస్తోంది. 768.50 కిలోమీటర్ల పైపులైను ద్వారా 9 పంపుహౌస్లు, ఏడు సంప్ హౌస్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది.