సారపాక, మార్చి 4: నిరుపేద కుటుంబాల్లోని ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కొండంత అండగా నిలుస్తున్నారని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. పేదల అభివృద్ధి, సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారని, అందుకు అనుగుణంగా అనేక పథకాలు అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. మణుగూరులోని 46 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.40 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అక్కడి తహసీల్ కార్యాలయలో తహసీల్దార్ నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శనివారం ఆయన పంపిణీ చేసి మాట్లాడారు.
నిరుపేద కుటుంబాల్లో ఆడబిడ్డలకు మేనమామగా మారి వారి వివాహం కోసం సర్కారు కానుకగా రూ.1,00,116 అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని కొనియాడారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి బృహత్తర పథకాలు దేశంలో మరెక్కడా లేవని గుర్తుచేశారు. ప్రజాప్రతినిధులు, నాయకులు పోశం నర్సింహారావు, ముత్యం బాబు, అడపా అప్పారావు, కుర్రి నాగేశ్వరరావు, కారం విజయకుమారి, బొలిశెట్టి నవీన్, రామిడి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘మన బడి’తో మౌలిక సదుపాయాలు..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంతో సర్కారు బడుల రూపురేఖలు మారుతున్నాయని ప్రభుత్వ విప్ రేగా పేర్కొన్నారు. ‘మన బడి’లో భాగంగా మణుగూరు ఉన్నత పాఠశాలలో రూ.29.44 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని ఆయన పరిశీలించారు.
సమీకృత మార్కెట్ పనుల పరిశీలన..
మణుగూరు రాజీవ్గాంధీనగర్లో రూ.4.50 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ పనులను ప్రభుత్వ విప్ రేగా కాంతారావు శనివారం పరిశీలించారు. పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.