ఖమ్మం అర్బన్, జూన్ 27 : విద్యార్థులను తీర్చిదిద్దేందుకు నెలకొల్పే విద్యాసంస్థలు ఎంతో ఆదర్శంగా ఉండాలి. ఉన్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్యనందించాలి. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ విద్యార్థుల ప్రగతే ధ్యేయంగా పనిచేయాలి. క్రమశిక్షణ కలిగి ఉండాలి. విద్యార్థుల తప్పొప్పులను సరిదిద్దాలి. వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి. కానీ, కొన్ని ప్రైవేటు పాఠశాలలు మాత్రం ప్రభుత్వ నిబంధనలను యథేచ్ఛగా దిక్కరిస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండా ‘ధన’మే పరమావధిగా తమ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
విద్యార్థులకు కల్లబొల్లి మాటలు చెబుతూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. అనుమతుల్లేని పాఠశాలల వివరాలు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం కనీసం వాటివైపు కన్నెత్తి కూడా చూడరు. నోటీసులూ ఇవ్వరు. ఇష్టానుసారం వ్యవహరిస్తున్న ఆయా పాఠశాలలపై చర్యలు కూడా తీసుకోరు. పైగా చోద్యం చూస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా తనిఖీలు చేసేందుకు ముందుకు రావడం లేదు. జిల్లావ్యాప్తంగా ఏయే పాఠశాలలకు అనుమతుల్లేవో తెలుసుకుంటూ, విద్యార్థుల తల్లిదండ్రులు ఎలా అప్రమత్తంగా ఉండాలో తెలియజేస్తూ ఉండాల్సిన విద్యాశాఖ అధికారులు తమ కర్తవ్యాన్ని మరిచారు. చాలా ప్రాంతాల్లో విద్యార్థులను వారి తల్లిదండ్రులు అనుమతుల్లేని పాఠశాలలల్లో చేర్చి అన్ని విధాలా నష్టపోతున్నారు. కొన్ని చోట్ల విద్యా సంవత్సరం పూర్తయిన తర్వాత తెలుసుకున్నా.. అప్పటికే విద్యా సంవత్సరం నష్టపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
వ్యాపారానికి కాదేదీ అనర్హమన్నట్లుగా విద్యా వ్యవస్థను కూడా వ్యాపారంగా మార్చాయి కొన్ని ప్రైవేటు పాఠశాలలు. తమ పాఠశాలలకు ఎలాంటి అనుమతులు లేకపోయినా తల్లిదండ్రులను ఏమార్చి ప్రవేశాలు నిర్వహిస్తున్నారు ఆయా పాఠశాలల యజమానులు. నిబంధనల ప్రకారం అయితే.. పాఠశాల నిర్వహణకు అవసరమైన అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ప్రవేశాలు చేయాలి. కానీ, కొన్ని ప్రైవేటు పాఠశాలల యజమానులు మాత్రం.. పర్మిషన్ లేకముందే, ఒకవేళ పర్మిషన్ గడువు పూర్తయినా రెన్యూవల్ కాకముందే ‘ధన’ దాహంతో అడ్మిషన్లు చేస్తున్నారు.
విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారు. ఆకర్షణీయమైన పేర్లను పెట్టి మల్టీ కలర్ బ్రోచర్లు ముద్రించి ప్రచారం చేస్తున్నారు. తమ పదునైన మెప్పించగల గారడీ మాటలతో మాయ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను తమ బుట్టల్లో పడేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో కూడా ఈ తరహా అనుమతులు లేని పాఠశాలలు ఉన్నాయి. మండల కేంద్రాల్లోనూ ఈ సంఖ్య ఎక్కువగానే ఉంది. ప్రీ స్కూల్గా ప్రారంభించడం, ఒక్కో విద్యార్థి నుంచి రూ.20 వేల వరకు ఫీజు వసూలు చేయడం, ఆ తర్వాత పాఠశాలను విస్తరించడం వంటివి చేస్తున్నారు. కానీ, అనుమతులు మాత్రం తీసుకోవడం లేదు.
సరైన అనుమతుల్లేకపోయినా గల్లీకో ప్రీ స్కూల్ పుట్టుకొస్తోంది. విద్యను వ్యాపారంగా చేసుకుంటున్న కొన్ని ప్రైవేటు పాఠశాలల యజమానులు.. అనుమతేలేవీ లేకపోయినా పాఠశాలను ప్రారంభిస్తున్నారు. ప్రవేశాలు మొదలుపెడుతున్నారు. అదే క్రమంలో అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నారు. అన్నీ సక్రమంగా లేక అనుమతులు రాకపోయినా.. వచ్చినట్లుగా చెప్పి విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నారు. మరోవైపు వినూత్నమైన పేర్లతో ప్రచారం చేస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా అనుమానం రావడం లేదు. ఒకవేళ ఒక్కరో ఇద్దరో అడిగినా నేడో రేపో అనుమతులు రావడమే తరువాయి అంటూ నమ్మబలుకుతున్నారు. అలా చాలా విద్యా సంవత్సరాలను పూర్తిచేస్తున్నారు. ఇలాంటి పాఠశాలలు ఖమ్మం నగరంతోపాటు ఖమ్మం రూరల్ మండలంలో అధికంగా ఉన్నాయి.
అనుమతుల్లేని పాఠశాలల వివరాలను అధికారులు మూడు నెలల క్రితం నామమాత్రంగా ప్రకటించారు. ఆ తదుపరి ఊసే లేకుండా పోయింది. ఇక, ఈ విద్యాసంవత్సరంలో అనుమతుల్లేని పాఠశాలల జాబితాను ప్రకటించాల్సి ఉంది. అయినా అధికారులు ఆ విషయాన్ని మరిచారు. విద్యార్థి సంఘాలు ధర్నాలు చేస్తున్నప్పటికీ అధికారులు మాత్రం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కనీసం కొన్ని కొన్ని పాఠశాలలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదంటే అతిశయోక్తి కాదు. తనిఖీలు చేయడం, నోటీసులివ్వడం వంటివి లేనేలేవు. అయితే, అనుమతుల్లేని పాఠశాలల హడావిడి అంతా ఇంతా కాదు. కొంచెం ఆకట్టుకోగలిగే ఉపాధ్యాయులను నియమించుకొని ఎలాగోలా వారి టార్గెట్లు పూర్తి చేసుకుంటున్నారు. అయితే, కొన్ని అనుమతుల్లేని, అనుమతులున్న ప్రైవేట్ పాఠశాలల్లో కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తుండడం గమనార్హం.