పినపాక, సెప్టెంబర్ 12: ఆరోగ్య తెలంగాణ స్థాపనే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మరికొన్ని కేంద్రాల్లో భాగంగా పినపాక వైద్యశాలలో ‘ఆరోగ్య మహిళ’ కేంద్రాన్ని మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ఏర్పడకముందు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల తీరు అధ్వానంగా ఉండేదని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత ప్రభుత్వ వైద్యంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు.
దీంతో ప్రభుత్వ వైద్యశాలలన్నీ కార్పొరేట్కు దీటుగా వైద్య సేవలు అందిస్తున్నాయని వివరించారు. అలాగే మహిళల వైద్య పరీక్షల కోసం వైద్యశాలల్లో ప్రత్యేక విభాగాలను ప్రారంభించినట్లు చెప్పారు. ఇందులో భాగంగానే ఆరోగ్య మహిళ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 18 ఏళ్లకు పైబడిన మహిళలందరూ ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నూతన ఆసుపత్రి భవన పనుల పరిశీలన..
పినపాక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రూ.1.56 కోట్లతో నిర్మిస్తున్న నూతన ఆసుపత్రి భవన సదుపాయాన్ని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పరిశీలించారు. పూర్తిస్థాయి నాణ్యత ప్రమాణాలతో నిర్మించాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు గుమ్మడి గాంధీ, గొగ్గెల నాగేశ్వరరావు, సత్యం, వర్మ, భద్రయ్య, పగడాల సతీశ్రెడ్డి, మధు, సింధుప్రియ, చంద్రశేఖర్, దొడ్డా శ్రీనివాస్రెడ్డి, కొండేరు రాము, బత్తుల వెంకటరెడ్డి, బొలిశెట్టి నర్సింహరావు, కటకం గణేశ్, బూర సురేశ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.