నమస్తే నెట్వర్క్, అక్టోబర్ 26 : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకెళ్లాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. ఇందుకోసం ఐకమత్యంగా ఉండాలని, కార్యకర్తలు మరింత చురుకుదనంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం, ప్రజా సమస్యలపై ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం కోసం బీఆర్ఎస్ జిల్లా కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని అన్ని మండలాల్లోనూ ఆదివారం గులాబీ జెండాలను ఆవిష్కరించారు.
మణుగూరులోని తెలంగాణ భవన్లో పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఆ హామీలను అమలుచేయడంలో విఫలమైందని విమర్శించారు. ఆ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరిట రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేసిందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ద్రోహంపై బాకీ కార్డులను కూడా ప్రతి గ్రామంలోనూ ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి ప్రభుత్వం.. ప్రజలను మోసం చేయడానికి, సర్కారు సంపదను దోచుకోవడానికే ప్రాధాన్యమిస్తోందని దుయ్యబట్టారు. అసమర్థ ప్రభుత్వాన్ని ప్రజలు కూడా నిలదీయాలని పిలుపునిచ్చారు. భద్రాచలంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ నియోజకవర్గ నాయకుడు రావులపల్లి రాంప్రసాద్ గులాబీ జెండాను ఎగురవేశారు. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా గులాబీ జెండాలు రెపరెపలాడాయి. ‘జై తెలంగాణ’, జై కేసీఆర్’ నినాదాలు మార్మోగాయి. గులాబీ జెండా ఎగురుతున్న వేళ ప్రాంగణమంతా నినాదాలతో మారుమోగింది.